
1,027 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
26కు పెరిగిన మృతులు.. 830కి చేరిన కేసులు
కరోనా కోసం స్పెషల్గా కొత్త హాస్పిటల్
రవాణాతో పాటు అన్నింటినీ మూసేసిన చైనా
చైనా వైరస్ ధాటికి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా వైరస్కు బలైన వారి సంఖ్య 26కు పెరిగింది. కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా 830కి చేరింది. ఈ మేరకు ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 20 ప్రావిన్సుల్లో 1,072 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. 29 ప్రావిన్సుల్లో 830 కేసులు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పింది. చనిపోయిన వారిలో ఒక్క హుబీ ప్రావిన్స్లోనే 24 మంది ఉన్నారు. వైరస్ వ్యాప్తికి మూలమైన వుహాన్ సిటీ ఈ ప్రావిన్స్లోనే ఉంది. వైరస్ వేరే ప్రాంతాలకు సోకకుండా వుహాన్, హువాంగాంగ్ సిటీలకు రాకపోకలను బంద్ పెట్టిన చైనా, ఇప్పుడు ఆ నిబంధనలను మొత్తం 13 ప్రావిన్సులకు పెంచింది. దాని ప్రభావం 4.1 కోట్ల మంది జనంపైన పడింది. సెంట్రల్ హ్యూబీ ప్రావిన్స్లోని షియానింగ్, షియావోగన్, ఎన్షి, ఝిజాంగ్, ఈజౌ, లిచువాన్జింగ్జౌ, హువాంగ్షి, ఖియాంజియాంగ్, షియాంటావ్, చిబి వంటి సిటీల్లో అన్నీ బంద్ పెట్టింది. ట్యాక్సీ సర్వీసులపైనా ఆంక్షలు పెట్టింది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అత్యవసరాలు తప్ప షాపింగ్మాళ్లు, థియేటర్లను మూసేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం రూ.1,027 కోట్లు (100 కోట్ల యువాన్లు) విడుదల చేసింది. ఇక, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో షాంఘైలోని డీస్నీల్యాండ్ను మూసేశారు. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డిస్నీల్యాండ్ ప్రకటించింది. కాగా, తాజాగా సింగపూర్లోనూ కరోనా వైరస్ కేసు నమోదైంది.
పది రోజుల్లో కొత్త హాస్పిటల్
ప్రస్తుతం కరోనా వైరస్ రోగులతో హాస్పిటళ్లు కిక్కిరిసిపోతున్నాయి. అంతమందికి ట్రీట్మెంట్ చేసేందుకు ఆ వసతులు సరిపోవట్లేదు. దీంతో పది రోజుల్లో కొత్త హాస్పిటల్ను కట్టేందుకు చైనా సర్కారు చకచకా పనులు చేసేస్తోంది. ఫిబ్రవరి 3 నాటికల్లా ఆ హాస్పిటల్ను వాడుకలో తీసుకురావాలని పట్టుదలతో ఉంది. 25 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో వెయ్యి పడకల సామర్థ్యంతో వుహాన్లో ఆ హాస్పిటల్ను కడుతున్నారు. ఇప్పటికే అక్కడ పనులు మొదలయ్యాయి. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోవట్లేదన్న ఆరోపణల నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ స్పెషల్గా కరోనా బాధితులకే ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. 2003లోనూ బీజింగ్ శివార్లలో చైనా ఇలాగే ఓ ఆస్పత్రిని కట్టింది. అప్పుడు శార్స్ విజృంభించడంతో రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో కేవలం ఒక్క వారంలోనే ఆస్పత్రిని కట్టింది.
పిల్లలను వదిలేసి వెళ్లారు
జ్వరంతో బాధపడుతున్న పిల్లాడిని ఎయిర్పోర్టు అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో తమ ఇద్దరు పిల్లలను అక్కడే వదిలేసి విమానమెక్కేశారు ఆ పిల్లల తల్లిదండ్రులు. ఈ ఘటన నాన్జింగ్ సిటీలో జరిగింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వాళ్ల ఫ్యామిలీ నాన్జింగ్ నుంచి ఛాంగ్షా వెళ్లేందుకు నాన్జింగ్లోని లుకౌ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే, బాబుకు జ్వరం ఉండడంతో ఎయిర్పోర్ట్ అధికారులు వాళ్లను లోపలకు పంపించలేదు. దీంతో వాళ్లు అధికారులతో చిన్నపాటి గొడవ పెట్టుకున్నారు. ప్రయాణికులను లోపలికి పంపించే డిపార్చర్ గేట్కు అడ్డంగా నిలబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వాళ్లతో వాగ్వాదానికి దిగారు. పై అధికారులు వచ్చి సర్ది చెప్పినా వినిపించుకోలేదు. అయితే, తల్లిదండ్రులిద్దరూ విమానంలో ఎక్కేందుకు అధికారులు ఓకే చెప్పడంతో, వాళ్లు ఎంచక్కా విమానం ఎక్కేశారు. పిల్లలను మాత్రం అక్కడే వదిలేశారు. అయితే ఆ తర్వాత అధికారులతో చర్చించి అదే విమానంలో పిల్లలకు ప్రత్యేక సీట్లు కేటాయించి పంపించారు. దీంతో విమానం మూడు గంటలు లేట్ అయింది.
అంతా ఆ ల్యాబ్ వల్లేనా
శార్స్, ఎబోలా వైరస్లపై స్టడీ కోసం 2017లో చైనా వుహాన్లో నేషనల్ బయోసేఫ్టీ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. అయితే, దాని వల్ల వైరస్లు బయటకు లీకయ్యే ప్రమాదముందని అప్పుడే అమెరికాకు చెందిన బయోసేఫ్టీ నిపుణులు హెచ్చరించారట. నిజానికి బీజింగ్లోని ల్యాబ్ నుంచి చాలా సార్లు శార్స్ వైరస్ బయటకు పాకిందని అన్నారు. ఇప్పుడు ఈ కొత్త కరోనా వైరస్ అక్కడి నుంచే పాకి ఉండొచ్చని అంటున్నారు. అయితే, అమెరికాలోని రట్గర్స్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం ఆ ల్యాబ్ నుంచే వచ్చిందని ఇప్పుడప్పుడే చెప్పలేమంటున్నారు. ల్యాబ్లోని వైరస్ల జీనోమ్లను, ఇప్పుడు పాకిన కొత్త కరోనా వైరస్ జీనోమ్లతో పోల్చి చూస్తే అసలు విషయమేంటన్నది తెలుస్తుందన్నారు.
చిక్కుకుపోయిన 700 మంది ఇండియన్ స్టూడెంట్లు
వుహాన్తో పాటు వివిధ సిటీలకు రాకపోకలను బంద్ పెట్టడంతో ఇండియన్ స్టూడెంట్లు అక్కడే చిక్కుకుపోయారు. ఒక్క వుహాన్లోనే 700 మంది ఇండియన్ స్టూడెంట్లు ఇండియాకు వచ్చే దారి లేక అక్కడే ఉండిపోయారు. అందులో ఎక్కువ మంది మెడిసిన్ చదువుతున్నవాళ్లే ఉన్నారు. వాళ్ల సేఫ్టీపై వారి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. కొంతమంది స్టూడెంట్లు గురువారం లేదా శుక్రవారం కోల్కతాకు వచ్చేందుకు ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఆయా స్టూడెంట్లకు ఫుడ్, అవసరమైన వసతులు కల్పించాల్సిందిగా ఇప్పటికే చైనా అధికారులకు ఇండియన్ ఎంబసీ అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా వాళ్ల కోసం స్పెషల్గా ఎంబసీలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేశారు. ‘‘చైనాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూనే ఉన్నాం. డబ్ల్యూహెచ్వో ఇచ్చిన సూచనలనూ దృష్టిలో పెట్టుకున్నాం. ఇండియన్ స్టూడెంట్లకు హెల్ప్ చేస్తామని చైనా అధికారులు హామీ ఇచ్చారు. వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకుంటామన్నారు’’ అని ఇండియన్ ఎంబసీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ను ఇండియన్ ఎంబసీ క్యాన్సిల్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించింది.
ఇద్దరికి ముంబై ఆస్పత్రిలో ట్రీట్మెంట్
కరోనా వైరస్ సోకిందన్న అనుమానాల నేపథ్యంలో ముంబైలో ఇద్దరు పేషెంట్లకు స్పెషల్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎయిర్పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఇప్పటిదాకా 1,789 మందికి స్కానింగ్ చేశారు. అందులో చైనాకు వెళ్లి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు అనుమానించారు. వాళ్లను చించ్పోకలిలోని కస్తూర్బా హాస్పిటల్లో పెట్టి ట్రీట్ చేస్తున్నారు. ఆ ఆస్పత్రిలో స్పెషల్గా ఐసోలేషన్ వార్డును బృహన్ముంబై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కాగా, సౌదీ అరేబియాలోని ఖామిస్ ముషైత్లో ఉన్న అల్హయత్ ఆస్పత్రిలో పనిచేసే 100 మంది ఇండియన్ నర్సుల్లో ఒక్కరు తప్ప అంతా సేఫ్ అని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ తెలిపారు. అక్కడి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడామన్నారు. కేరళ నర్సుకు సోకింది కరోనా వైరస్ కాదని, ప్రస్తుతం ఆమెకు అసీర్ నేషనల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని, ఆమె కోలుకుంటోందని చెప్పారు.
Municipal Elections Results Live Watch Here: