టెక్నాలజీ పెరిగే కొద్దీ ట్రాన్స్పోర్ట్ విషయంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు ప్రజా రవాణాలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చాయి. కానీ తక్కువ టైంలో దూర ప్రయాణాలు పూర్తి చేయాలంటే విమానాలు ఎక్కడం తప్ప మరో మార్గం లేదు. అయితే దీనికి టికెట్ రేటు బాగా ఎక్కువగా ఉండడం వల్ల అందరూ ఫ్లైట్ ట్రావెల్ చేయలేరు. అందుకే అమెరికాకు చెందిన ఓ కంపెనీ డ్రోన్ బస్సు టెక్నాలజీని తీసుకువస్తోంది. ట్రైన్ టికెట్ రేటుతో హెలికాప్టర్ రేంజ్ ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
40 మంది సీటింగ్తో ట్రావెల్ చేసే డ్రోన్
తక్కువ టైమ్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయగలిగే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్పై ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలు దృష్టి పెట్టాయి. అది కూడా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్నది వాటి టార్గెట్. ఇప్పటికే అమెరికాకు ఉబర్ కంపెనీ ఎయిర్ టాక్సీ సిస్టమ్ తీసుకొచ్చి, సిటీల్లో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చేస్తామని ప్రకటించింది. ఉబర్ ఎలివేట్ పేరుతో డెవలప్ చేస్తున్న ఈ టాక్సీ 2023 నాటికి అందుబాటులోకి వస్తుందని ఆ కంపెనీ వెల్లడించింది. అయితే ఇందులో కేవలం నలుగురు మాత్రమే ప్రయాణించగలుగుతారు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్కు చెందిన మరో కంపెనీ ఏకంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు ఉపయోగపడేలా డ్రోన్ బస్ను డెవలప్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఒకేసారి 40 మంది ప్రయాణించేలా ఎలక్ట్రికల్ డ్రోన్ బస్సును డిజైన్ చేస్తున్నామని కెలెకొన కంపెనీ తెలిపింది. ఇది మామూలు డ్రోన్స్ ఎగిరినట్టుగానే గాలిలో ఎగురుతూ ఒక క్లోజ్డ్ హెలికాప్టర్లా ట్రావెల్ చేస్తుందని ఆ సంస్థ చెప్పింది.
డ్రోన్ బస్ ఇట్ల ఉంటది
డ్రోన్కు ఒక ఫ్లైయింగ్ సాసర్ను అటాచ్ చేసినట్లుగా కనిపిస్తుంది ఈ డ్రోన్ బస్. దీని ఫంక్షనింగ్ అంతా పూర్తిగా ఫ్లైట్లో ఉన్నట్టే ఉంటుంది. మూవబుల్ ప్రొపెల్లర్స్తో కూడిన ఎనిమిది భారీ ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్లైట్ మాదిరిగానే టేకాఫ్, ల్యాండింగ్ గేర్ సిస్టమ్స్ ఉంటాయి. టెస్లా మోడల్ ఎస్, మోడల్ 3 కార్లలో వాడే బ్యాటరీ సిస్టమ్తో డ్రోన్ బస్సు నడుస్తుంది. 3.6 మెగావాట్ అవర్స్ కెపాసిటీ ఉండే జంబో బ్యాటరీని దీనిలో వాడుతున్నారు. ఈ పవర్తో కొన్ని వేల ఇండ్లకు కరెంట్ సప్లై చేయొచ్చు. డ్రోన్ బస్సులో మొత్తంగా బ్యాటరీని మార్చి, మరోదానిని పెట్టుకుని వాడుకునేలా డిజైన్ చేసినట్లు కెలెకొన కంపెనీ తెలిపింది. దీంతో రీచార్జ్ చేసేందుకు టైమ్ వేస్ట్ కాకుండా మరో బ్యాటరీ మార్చుకుని, మళ్లీ దానికి చార్జింగ్ పెట్టుకోవచ్చని పేర్కొంది.
మిలటరీ, కార్గో అవసరాలకూ వాడొచ్చు
స్పీడ్ ట్రావెల్కు ఉపయోగపడేలా ఇప్పటికే చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో ఆరుగురు మాత్రమే ట్రావెల్ చేయగలరు. అందుకే దాని ట్రావెల్ చార్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సిటీల మధ్య ఒకే ఎయిర్క్రాఫ్ట్లో ఎక్కువ మంది ప్రయాణించేలా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయగలిగితే టికెట్ కాస్ట్ తగ్గించవచ్చని బ్రేడెన్ కెలెకొన అన్నారు. తాము డెవలప్ చేస్తున్న ఈ డ్రోన్ బస్సును పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో పాటు యుద్ధం జరిగే ప్రాంతాలకు సైనికులను తరలించేందుకు, మామూలు కార్గో అవసరాలకు కూడా వాడుకోవచ్చని చెప్పారు.
అర గంటలో 200 కిలోమీటర్లు..
దూర ప్రయాణాలు చేసేవాళ్లు రోడ్డుపై వెళ్లాలంటే చాలా టైమ్ తీసుకుంటుంది. రోడ్ ట్రాఫిక్, పొల్యూషన్ లాంటి సమస్యలు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్లు ఫ్లైట్లో ప్రయాణానికి ఖర్చు పెట్టలేకపోవచ్చు. అందుకే ఈ అన్ని సమస్యలను అధిగమించేలా ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ క్రాఫ్ట్ను డెవలప్ చేయాలని నిర్ణయించుకున్నామని కెలెకొన కంపెనీ ఫౌండర్ బ్రేడెన్ కెలెకొన చెప్పారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే మెయిన్ టార్గెట్గా తాము 40 మందితో ప్రయాణించగలిగే డ్రోన్ బస్సు డిజైన్పై ఫోకస్ పెట్టామన్నారు. మొదటగా అమెరికాలోని మన్హట్టన్ – హాంప్టన్ రూట్లో దీని సర్వీసులు స్టార్ట్ చేయాలని, ఆ తర్వాత న్యూయార్క్, లాస్ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కోలతో పాటు ప్యారిస్, లండన్కూ వీటిని ప్రారంభించాలని భావిస్తున్నామని చెప్పారు. మన్హాట్టన్ నుంచి హాంప్టన్ మధ్య సుమారు 200 కిలోమీటర్ల దూరం.. అర గంట టైమ్లోనే ట్రావెల్ చేయొచ్చని తెలిపారు. దీనికి ఖర్చు కూడా ట్రైన్ టికెట్తో సమానమని, కేవలం 85 డాలర్లు మాత్రమే చార్జ్ చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఈ డ్రోన్ బస్సులు వచ్చే ఏడాది కల్లా రెడీ అవుతాయని, అయితే ప్రజలకు అందుబాటులోకి రావడానికి మాత్రం మరో రెండేళ్లు పట్టొచ్చని అన్నారు.