- సపోర్ట్ లెవెల్స్ దగ్గర షేరు ధర అప్ ట్రెండ్ కొనసాగుతుందంటున్న ఎనలిస్టులు
న్యూఢిల్లీ: ఇండెక్స్ హెవీ వెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ గత కొన్ని సెషన్లుగా నష్టాల్లో ట్రేడవుతోంది. కంపెనీ షేర్లు వరుసగా నాలుగో సెషన్ అయిన బుధవారం కూడా నెగెటివ్లో కదిలాయి. బ్లాక్ డీల్లో రెండు కోట్ల షేర్లు చేతులు మారాయని వార్తలొచ్చాయి. వీటి విలువ రూ. 4,512 కోట్లు. ఈ బ్లాక్ డీల్లో పాల్గొన్న బయ్యర్, సెల్లర్ వివరాలు బయటకు రాలేదు. కంపెనీ షేర్లు రెండున్నర శాతం క్రాష్ అవ్వడంతో నిఫ్టీ బుధవారం 231 పాయింట్లు పడిందని చెప్పొచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బుధవారం రూ.2,423 దగ్గర ఓపెన్ అయ్యాయి. రూ.2,426 దగ్గర ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రూ.2,362 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. చివరికి రూ. 2,381 వద్ద సెటిలయ్యాయి. బ్లాక్ డీల్ కారణంగా లాస్లో రిలయన్స్ షేర్లు ఓపెన్ అయ్యాయని ఏంజెల్ వన్ ఎనలిస్ట్ రాజేష్ బోస్లే అన్నారు. ఆ తర్వాత పెద్ద యాక్టివిటీ కనిపించలేదని, ఇంట్రాడే కనిష్టం నుంచి కొద్దిగా పెరిగి క్లోజయ్యాయని చెప్పారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 89 రోజుల మూవీంగ్ యావరేజ్ దగ్గర కదులుతున్నాయని అన్నారు.
కంపెనీ షేర్ల క్లోజింగ్ ధరను బట్టి మార్కెట్ డైరెక్షన్ను విశ్లేషించొచ్చని చెప్పారు. కంపెనీ షేర్లు 2,410–2,430 రేంజ్లో క్లోజయితే అప్ట్రెండ్ చూడొచ్చని, అదే రూ. 2,370 దిగువన క్లోజయితే షార్ట్ టెర్మ్లో కరెక్షన్ చూడొచ్చని చెప్పారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డీమెర్జర్ తర్వాత నుంచి రిలయన్స్ షేర్లు ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవుతున్నాయని 5పైసా ఎనలిస్ట్ రుచిత్ జైన్ పేర్కొన్నారు. లాంగ్ టెర్మ్ ట్రెండ్ పాజిటివ్గా ఉందని, షేర్లు పడినప్పుడు కొనుగోలు చేసుకోవాలని సలహా ఇచ్చారు. టెక్నికల్గా చూస్తే కంపెనీ షేర్లు 2,350 కంటే దిగువకు పడవని అంచనావేస్తున్నామని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. రూ.2,300–2,350 లెవెల్స్ దగ్గర కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చని చెప్పారు.