
న్యూఢిల్లీ: డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తన ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ టార్గెట్’ కార్యక్రమం కింద 30 దేశాలకు చెందిన 106 కంపెనీలను గుర్తించిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దేశంలో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. పరిశ్రమలతో, ఎగుమతిదారులతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ కార్యక్రమం గురించి చర్చించింది. పెట్టుబడులను పెంచడానికి మంత్రిత్వ శాఖ ద్వారా ఇది వరకే ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కంపెనీల నాయకత్వంతో సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు కూడా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ మూలాలు కలిగిన ఇండస్ట్రియలిస్టులతోనూ సమావేశాలు ఉంటాయని డీపీఐఐటీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోకి పెట్టుబడులను రప్పించడానికి.. సమ్మతి భారాన్ని (కంప్లాయెన్స్ బర్డెన్) తగ్గించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను సడలించడం, లాజిస్టిక్స్ విధానాన్ని రూపొందించడం, 14 రంగాలకు పీఎల్ఐ అమలు చేయడం, జాతీయ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా విధానాలను సడలించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. అయితే ఈ కార్యక్రమం కింద ఏయే రంగాల కంపెనీలతో చర్చలు జరుపుతున్నారనే విషయాన్ని డీపీఐఐటీ వెల్లడించలేదు. యూఎస్, కెనడా, యూఏఈ, సౌదీ అరేబియా, యూఏ, జర్మనీ, స్వీడన్, జపాన్, తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలలో ఇన్వెస్ట్మెంట్ రోడ్షోలను నిర్వహించేందుకు ప్లాన్స్ తయారవుతున్నాయి.
తగ్గిన ఎఫ్డీఐలు
2022–-23లో భారతదేశంలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు (ఎఫ్డీఐలు) 22 శాతం తగ్గి 46 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇన్ఫ్లోలు 2021–-22లో 84.83 బిలియన్ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం తగ్గి 70.97 బిలియన్ డాలర్లుకు చేరుకున్నాయి. 2022–-23 ఏప్రిల్--–మార్చి మధ్యకాలంలో, సింగపూర్ 17.2 బిలియన్ డాలర్లు ఎఫ్డీఐతో భారీ పెట్టుబడిదారుగా అవతరించింది. తర్వాతి స్థానాల్లో మారిషస్ (6.13 బిలియన్ డాలర్లు), యూఎస్ (6 బిలియన్ డాలర్లు), యూఏఈ (3.35 బిలియన్ డాలర్లు), నెదర్లాండ్స్ (2.5 బిలియన్ డాలర్లు), జపాన్ (1.8 బిలియన్ డాలర్లు), యూకే (1.73 బిలియన్ డాలర్లు), సైప్రస్ (1.27 బిలియన్ డాలర్లు) కేమాన్ ఐలాండ్స్(772 మిలియన్ డాలర్లు), జర్మనీ (547 మిలియన్లు డాలర్లు) ఉన్నాయి.