ఇండ్లు కోల్పోయిన వారిని అడ్డా కూలీలుగా చేశారు

ఇండ్లు కోల్పోయిన వారిని అడ్డా కూలీలుగా చేశారు

చండూరు, (నాంపల్లి) వెలుగు: తెలంగాణను దోచుకున్నది చాలక ఇప్పుడు దేశం మీద పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్​పై మండిపడ్డారు. సోమవారం నల్గొండ జిల్లా నాంపల్లిలో 129వరోజు బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వడ్డెపల్లి, టీపీ గౌరారం, మళ్ళపురాజుపల్లి గ్రామాల్లో పర్యటించారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ చర్లగూడెం, క్రిష్ణరాయినిపల్లి వంటి ప్రాజెక్టులతో కోట్లు కూడబెట్టుకుని, భూములు, ఇండ్లు కోల్పోయిన వారిని అడ్డా కూలీలుగా చేశారని ఆరోపించారు. సంపాదించిన సొమ్ముతో అబద్దాలు ప్రచారం చేస్తూ అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తున్నారన్నారు.

ప్రజల సమస్యలు చెప్పుకోడానికి రూ.కోటితో నిర్మించిన క్యాంపు కార్యాలయం తాగుబోతుల అడ్డాగా మారిందన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఒక్కటై డ్రామాలు చేస్తున్నారన్నారు. యూపీలో మాయవతి ముఖ్యమంత్రిగా ఏడు లక్షల ఎకరాల భూమిని పంచినట్టే, తెలంగాణలో కూడా పంచుతామని హామీ ఇచ్చారు. తర్వాత పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు పూదరి సైదులు, జిల్లా నాయకులు పూదరి నర్సింహ, అంబేద్కర్, నియోజకవర్గ అధ్యక్షులు పల్లె లింగస్వామి,ఏర్పుల అర్జున్,మహిళా కన్వీనర్లు కత్తుల పద్మయాదవ్,ఎలిజబెత్,సుజాత,మండల కన్వీనర్ వినోద్ పాల్గొన్నారు.