పూణే రైల్వే స్టేషన్ నుండి వేల సంఖ్యలో పెంపుడు జంతువులు రైల్లో ప్రయాణిస్తున్నాయి. పూణే రైల్వే అధికారుల డేటా ప్రకారం 2023 జనవరి నుండి 2024 ఫిబ్రవరి మధ్య 7 వేల పెంపుడు జంతువులు ప్రయాణం చేశాయి. ఇందులో 4 వేల115 కుక్కలు, 752 పిల్లులు, 603 మేకలు, 1,689 కోడిపిల్లలు ఉన్నాయి.
రైల్వే స్టేషన్కు చాలా మంది కుక్కలు లేదా పిల్లులతో వస్తున్నారని రైల్వే స్టేషన్లోని చీఫ్ పార్శిల్ సూపర్వైజర్ ఉదయ్ తుపే తెలిపారు. రైలులో పెంపుడు జంతువులను తీసుకెళ్లడానికి రెండు పద్ధతులు ఉన్నాయని చెప్పారు.- ఒకటి క్యాబిన్ పెంపుడు జంతువులతో పాటు ప్రయాణించడం, మరొకటి బ్రేక్ వ్యాన్ ..పెంపుడు జంతువులను రైలులోని లగేజ్ వ్యాన్కు బదిలీ చేయడం అని తుపే తెలిపారు. పెంపుడు జంతువులకు ఆన్లైన్ బుకింగ్ సేవ అందుబాటులో లేదన్నారు. ప్రయాణికులు పెంపుడు జంతువులతో ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా టీకా సర్టిఫికేట్, వెటర్నరీ డాక్టర్ జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికేట్ లను తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు.
బ్రేక్ వ్యాన్ అనేది ప్రయాణికులు ప్రయాణించడానికి అనుమతించని పెంపుడు పెట్టెలతో కూడిన కోచ్ అని ఉదయ్ తుపే చెప్పారు క్యాబిన్ కంటే తక్కువ ధర ఉన్నందున ప్రయాణికులు బ్రేక్ వ్యాన్లలో స్లాట్లను బుక్ చేసుకుంటారని తెలిపారు. పెంపుడు జంతువులతో ప్రయాణించే ప్రయాణికులు రైలు ఎక్కడానికి రెండు గంటలు ముందుగా రైల్వే స్టేషన్కు చేరుకోవాలని తెలిపారు.
ఇక ఛార్జీలపై ఉదయ్ తుపే మాట్లాడుతూ, బ్రేక్ వ్యాన్లో పెంపుడు జంతువులను రవాణా చేయడానికి.. రైల్వేలు ప్రామాణికంగా 30 కిలోల బరువును నిర్ణయించాయి. పెంపుడు జంతువు 5 కిలోల బరువు ఉన్నప్పటికీ, ఛార్జీలు తగ్గవు. అయితే, రైళ్లు దూరాన్ని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకు పూణే నుండి ఢిల్లీకి ఓ కుక్కను తీసుకెళ్లడానికి సుమారుగా రూ. 800 ఉంటుంది. పెంపుడు జంతువుల ప్రయాణాల ద్వారా పూణే రైల్వే స్టేషన్ దాదాపు రూ. 13 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది.