- ఇద్దరు మహిళలు సహా వ్యక్తి అరెస్ట్
దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో దోపిడీకి ఓ మహిళ స్కెచ్ వేసింది. మరో ఇద్దరి సాయంతో ఇంట్లోకి చొరబడి పెప్పర్ స్ప్రే కొట్టి, దిండుతో అదిమిపట్టి, అరుపులు వినపడకుండా టీవీ సౌండ్ పెద్దగా పెట్టి చోరీకి పాల్పడింది. కర్మన్ ఘాట్ లోని పద్మానగర్లో సుగుణమ్మ(68) అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె కొడుకు లండన్లో ఉంటున్నాడు.
ఆమెకు పరిచయస్తురాలు అయిన గ్రీన్ పార్క్ కాలనీ కి చెందిన సుమిత్ర అనే మహిళ వృద్ధురాలి ఇంటిపై కన్నేసింది. చోరీ చేసేందుకు బోరబండలో ఉండే తన సోదరి సుశీల, మరిది శివకృష్ణ సాయం తీసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుగుణమ్మ ఇంట్లోకి ముందుగా సుమిత్ర వెళ్లింది. ఆమెను మాటల్లో పెట్టి పెప్పర్ స్ప్రే ముఖంపై చల్లింది. బయట ఉన్న సోదరి, మరిదిలను ఇంట్లోకి పిలిచింది. వీరు అరుస్తున్న వృద్ధురాలిని నిర్బంధించి, ముఖానికి దిండు అడ్డు పెట్టారు
టీవీ సౌండ్ పెంచి అరుపులు బయటకు రాకుండా చేశారు. లాకర్ తాళాలు ఇవ్వాలని బెదిరించారు. ఇవ్వకపోవడంతో వృద్ధురాలిని చితకబాది ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, గాజులు, ఉంగరాలు సుమారు 10 తులాల వరకు తీసుకొని పరారయ్యారు. ఈ కేసులో నిందితులు ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ కృష్ణయ్య, సీఐ సైదిరెడ్డి తెలిపారు.
మరోచోట బస్సులో బంగారం చోరీ
ఎల్బీనగర్: యాదాద్రి -భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యానగర్కు చెందిన రమణమ్మ(60) ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ బస్సు ఎక్కి హయత్నగర్ చేరుకునే సరికి బ్యాగ్ జిప్ తెరిచి ఉండడాన్ని గమనించింది. పరిశీలించగా బ్యాగ్లోని 7 తులాల బంగారం, వెండి ఆభరణాలు కనిపించలేదు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
