
మాదాపూర్, వెలుగు: సోమవారం తెల్లవారుజామున జరిగిన రియల్టర్ హత్య కేసును మాదాపూర్ పోలీసులు ఛేదించారు. భూ వివాదమే హత్యకు కారణమని తేల్చి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మంగళవారం మాదాపూర్ పీఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను మాదాపూర్ జోన్ ఇన్చార్జి డీసీపీ సందీప్ వెల్లడించారు. దుండిగుల్ దొమ్మర పోచంపల్లి ప్రాంతానికి చెందిన ముజాహిద్(50), యూసఫ్గూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జిలానీ పాషా(25), కాలాపత్తర్కు చెందిన ఇస్మాయిల్ (38) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరిపై సిటీలోని పలు పీఎస్లలో గొడవలు, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఇస్మాయిల్పై రౌడీ షీట్ ఉంది. ఓ హత్య కేసులో బెయిల్పై బయటకు వచ్చాడు. జైలులో ఉన్న టైమ్లో అతడికి ముజాహిద్, జిలానీ పాషాతో పరిచయం ఏర్పడి ఫ్రెండ్స్ అయ్యారు. బయటకు వచ్చాక ముగ్గురు కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు మొదలుపెట్టారు. జహీరాబాద్ దగ్గరలోని రంజోల్లో 3 ఎకరాల్లో వెంచర్ వేశారు. ఇస్మాయిల్మరోసారి జైలుకు వెళ్లిన టైమ్లో ముజాహిద్, జిలానీలు వెంచర్లోని కొన్ని ప్లాట్లను అమ్ముకున్నారు. బయటకు వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న ఇస్మాయిల్దీనిపై ముజాహిద్ను నిలదీశాడు. దీంతో ముజాహిద్ తాడ్బన్ దగ్గర ఉన్న 250 గజాల ల్యాండ్ను ఇస్మాయిల్ పేరుపై గిఫ్ట్ డీడ్ చేశాడు. ఆ తర్వాత తనకు 250 గజాల ల్యాండ్ ఇవ్వాలని, నీకు రూ. 20లక్షలు ఇస్తానని ఇస్మాయిల్తో ముజాహిద్ చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత నెలలో ఇదే విషయమై ముజాహిద్, ఇస్మాయిల్ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ముజాహిద్తో వచ్చిన జిలానీ పాషాపై ఇస్మాయిల్ దాడి చేయడంతో పాటు ముజాహిద్ను బెదిరించాడు. అప్పటి నుంచి ఇస్మాయిల్పై ముజాహిద్, జిలానీ పాషా పగ పెంచుకున్నారు. ఇస్మాయిల్ నుంచి ప్రాణభయం ఉందని నిర్ణయించుకున్నారు.
యూపీ నుంచి గన్స్, బుల్లెట్లు తెచ్చుకుని..
ఇస్మాయిల్ నుండి ప్రాణభయం ఉందనుకొని ముజాహిద్, జిలానీ యూపీకి వెళ్లి తుండా అనే వ్యక్తి వద్ద రెండు కంట్రీమేడ్ గన్స్, 7 రౌండ్ల బుల్లెట్లు కొన్నారు. ఆదివారం సాయంత్రం ల్యాండ్ సెటిల్మెంట్ విషయంపై మాట్లాడుకుందామని ముజాహిద్.. ఇస్మాయిల్కు కాల్ చేసి చెప్పాడు. దీంతో ఇస్మాయిల్ తన ఫ్రెండ్స్ జహంగీర్, అక్రం, గౌస్తో కలిసి కారులో రాత్రి 7 గంటలకు బహదూర్పూరాకు వచ్చాడు. ముజాహిద్ సైతం కారులో రాగా అతడి అనుచరులు జిలానీ, ఫిరోజ్ ఖాన్ బైక్పై వచ్చారు.
వెనుకాలే స్కూటీపై జిలానీ, ఫిరోజ్ఖాన్..
అక్కడ ఇస్మాయిల్ను కారులో ఎక్కించుకున్న ముజాహిద్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ దగ్గరికి తీసుకొచ్చాడు. వీరి వెనుకాలే స్కూటీపై జిలానీ, ఫిరోజ్ఖాన్ వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు అక్కడే అందరూ కలిసి టిఫిన్ చేశారు. మరోసారి ల్యాండ్ గురించి ఇస్మాయిల్, ముజాహిద్ మళ్లీ మాట్లాడుకోగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. జిలానీ తన వెంట తెచ్చుకున్న గన్తో ఇస్మాయిల్ను కాల్చేందుకు యత్నించగా మిస్ఫైర్ అయ్యింది. వెంటనే ఇస్మాయిల్ రోడ్డుకు అవతలి వైపు కారులో ఉన్న జహంగీర్ను పిలిచాడు. ఈలోగా జిలానీ గన్ లోడ్ చేసుకుని మళ్లీ వచ్చి ఇస్మాయిల్ తల వెనుక భాగంలో కాల్చాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన జహంగీర్ను తలపై గన్తో కొట్టాడు. తర్వాత జిలానీ, ఫిరోజ్ బైక్పై , ముజాహిద్ కారులో పారిపోయాడు. ఇస్మాయిల్ను ఉస్మానియాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి వివరాలు సేకరించారు.
నిందితుల కోసం 7 స్పెషల్ టీమ్స్
నిందితుల కోసం మాదాపూర్ ఇన్ చార్జి డీసీపీ సందీప్ 7 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు స్కూటీపై వెళ్తున్న జిలానీ పాషా, ఫిరోజ్ఖాన్ను శంకర్పల్లి దగ్గరలోని జన్వాడ వద్ద స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ముజాహిద్ను మంగళవారం ఉదయం 10 గంటలకు జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముజాహిద్ వాడిన కారును చేవెళ్లలో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రెండు గన్స్, 7 రౌండ్ల బుల్లెట్స్, కత్తి, కారు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.