
కోల్కత్తా: మార్చి నెల 11 నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నందున సమ్మె ఆలోచన వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని బ్యాంకు ఉద్యోగుల సంఘాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఈ మూడు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో సాగుతున్న చర్చలు పాజిటివ్గా సాగుతున్నాయని, 15 శాతం జీతాల పెంపు, వారానికి అయిదు పని రోజులు తమ ప్రధాన డిమాండ్లని ఏఐబీఈఏ వెల్లడించింది. ఐబీఏ ముందుంచిన ఇతర డిమాండ్లపై కూడా చర్చలకు ఐబీఏ అంగీకరించినట్లు పేర్కొంది.