హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లోని ప్రతీ నలుగురిలో ముగ్గురుకి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓ రిపోర్ట్లో పేర్కొంది. టెర్మ్ ఇన్సూరెన్స్లపై అవగాహన కిందటేడాదితో పోలిస్తే 88 శాతం పెరిగిందని తెలిపింది. సేవింగ్స్ కంటే ఖర్చు చేయడానికి సిటీ ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారని, ట్రావెలింగ్, షాపింగ్, మూవీస్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఇండియా ప్రొటెక్షన్ కోషెంట్ ఆరో ఎడిషన్ (ఐపీక్యూ 6.0 ) లో వెల్లడించింది.
మొత్తం 25 సిటీల్లోని 4,700 మంది రెస్పాండెంట్ల అభిప్రాయాలను సేకరించి ఈ రిపోర్ట్ను తయారు చేసింది. సౌత్ ఇండియాలో ఎక్కువ మందికి ఇన్సూరెన్స్పై అవగాహన ఉందని వెల్లడించింది. సౌత్ ఇండియా మెట్రోల్లో హైదరాబాద్ సెకెండ్ ప్లేస్లో ఉందని, ఈ సిటీకి ఐపీక్యూ 6.0 లో 44 పాయింట్లు వచ్చాయని తెలిపింది. బెంగళూరు మొదటి ప్లేస్లో ఉందని పేర్కొంది. ‘హైదరాబాద్ ప్రజల్లో 59 శాతం మందికి ఇన్సూరెన్స్పై అవగాహన ఉంది.
74 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని వివిధ మార్గాల్లో కొనుగోలు చేశారు. తాము సేఫ్గా ఉన్నామనే భావన 80 శాతం మందికి ఉంది’ అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సీఈఓ ప్రశాంత్ త్రిపాఠి అన్నారు. ఇన్సూరెన్స్పై నార్త్ ఇండియాతో పోలిస్తే సౌత్ ఇండియా ప్రజలకు ఎక్కువ అవగాహన ఉందని, ఆన్లైన్లో పాలసీలు కొనడంలో కూడా వీరు ముందున్నారని అన్నారు.