ఐఏఎస్ కోచింగ్​ సెంటర్​లోకి వరద..ముగ్గురు స్టూడెంట్లు మృతి

ఐఏఎస్ కోచింగ్​ సెంటర్​లోకి వరద..ముగ్గురు స్టూడెంట్లు మృతి
  • ఢిల్లీలో ఘటన.. ముగ్గురు స్టూడెంట్లు మృతి
  • ఒక్కసారిగా సెల్లార్లోకి ముంచెత్తిన వర్షపు నీరు
  • లైబ్రరీలో చదువుకుంటున్న టైమ్​లోనే ప్రమాదం
  • 15 మందిని రెస్క్యూ చేసి కాపాడిన అధికారులు
  • సెంటర్ నిర్వాహకులు అరెస్ట్
  • మృతుల్లో శ్రీరాంపూర్ సింగరేణి మేనేజర్ బిడ్డ
  • వ్యవస్థ వైఫల్యమే కారణం: రాహుల్ గాంధీ
  • ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
  • బాధితులకు హెల్ప్ చేయాలని రెసిడెంట్ కమిషనర్​కు ఆదేశం

న్యూఢిల్లీ/కోల్​బెల్ట్ (నస్పూర్)​, వెలుగు:ఢిల్లీలో ఘోరం జరిగింది. రాజేంద్రనగర్ లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు స్టూడెంట్లు చనిపోయారు. శనివారం సాయంత్రం ఓల్డ్ రాజేంద్రనగర్​లో భారీ వర్షం కురిసింది. దీంతో వరద నీళ్లంతా సెల్లార్లోకి వెళ్లాయి. వరద ఉధృతికి లైబ్రరీ తలుపులు పగిలిపోయాయి. ఆ టైమ్​లో సుమారు 18 మంది స్టూడెంట్లు లోపలే ఉన్నారు. ఈ ఘటనలో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా మేనేజర్ విజయకుమార్​ కూతురు తానియా సోని (25) చనిపోయింది. అలాగే, యూపీకి చెందిన శ్రేయా యాదవ్ (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ (28) ప్రాణాలు కోల్పోయారు. 

మిగిలిన 15 మందిని ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేసి కాపాడింది. నిబంధనలకు విరుద్ధంగా బేస్​మెంట్​లో లైబ్రరీ ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. స్టోరేజీ కోసం వాడుకోవాల్సిన ఏరియాలో యాజమాన్యం లైబ్రరీ ఏర్పాటు చేసింది. బేస్​మెంట్​లో నీళ్లు చేరుతున్నాయని, లోపల స్టూడెంట్లు చిక్కుకున్నారని అటు పోలీసులకు.. ఇటు మున్సిపల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని తోటి స్టూడెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు చనిపోయారని పలువురు స్టూడెంట్లు రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ముందు ధర్నాకు దిగారు.

ప్రమాదానికి కారణమేంటి?

రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది రాజేంద్రనగర్ వీధిలోని లోతట్టు ప్రాంతంలో ఉంది. భారీ వర్షం కారణంగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతం కావడంతో బేస్​మెంట్ తలుపులు పగిలిపోయాయి. గ్రౌండ్ లెవల్ నుంచి 8 ఫీట్ల లోతులో బేస్​మెంట్ ఉంది. దీంతో నీళ్లు వేగంగా లోపలికెళ్లాయి. స్ట్రీట్​లోని డ్రైనేజీలు ఓవర్ ఫ్లో కావడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లైబ్రరీలోని ఫర్నీచర్, బుక్స్ నీళ్లలో తేలడంతో రెస్క్యూ ఆపరేషన్​కు ఇబ్బందైంది. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్టు పోలీసులు వివరించారు. 

శ్రీరాంపూర్ ఏరియాలో విషాదం

ఢిల్లీ రాజేంద్రనగర్ లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో వరద పోటెత్తడంతో సింగరేణి మేనేజర్ విజయ్ కుమార్ కూతురు తానియా సోని చనిపోయింది. ఈ ఘటనతో మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో విషాదం నెలకొన్నది. ఎస్సార్పీ 1 సింగరేణి బొగ్గు గని మేనేజర్​గా విజయ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. బిహార్​కు చెందిన విజయ్ కుమార్, బబిత దంపతులకు తానియా సోని, ఫలక్, ఆదిత్యకుమార్ సంతానం. ఆరు నెలల కిందే సివిల్స్​లో కోచింగ్ తీసుకునేందుకు తానియా ఢిల్లీ వెళ్లింది. శనివారం సాయంత్రం రెండో కూతురు ఫలక్​ను కాలేజ్​లో జాయిన్ చేసేందుకు విజయ్​కుమార్ కాన్పూర్ బయలుదేరారు. నాగ్​పూర్ లో ఉన్నప్పుడే తానియా చనిపోయిందని సమాచారం అందడంతో అటు నుంచే ఢిల్లీకి వెళ్లారు.

ప్రమాద ఘటనపై సీఎం రేవంత్​రెడ్డి ఆరా 

సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్​తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు తానియా సోని బీహర్ రాష్ట్రానికి చెందిన యువతి అని, ఆమె తండ్రి విజయ్​కుమార్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సీనియర్ మేనేజర్​గా పనిచేస్తున్నారని రెసిడెంట్ కమిషనర్ సీఎం రేవంత్​కు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా, తానియా సోని మృతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆమె తండ్రి​తో ఫోన్​లో మాట్లాడి సానుభూతి తెలిపారు.

శ్రేయ తండ్రి.. పాల వ్యాపారి

శ్రేయ కుటుంబ సభ్యులు యూపీలోని అంబేద్కర్ నగర్‌‌ లో ఉంటారు. ఏప్రిల్​లోనే శ్రేయ.. రావూస్​  కోచింగ్ సెంటర్‌‌ లో అడ్మిషన్ తీసుకున్నది. శ్రేయ తన ఇంటిలో మొదటి సంతానం. తండ్రి రాజేంద్ర యాదవ్ పాలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బిడ్డ చనిపోయిన విషయం టీవీలో చూసే తెలుసుకున్నామని ఘాజియాబాద్​లో ఉంటున్న ఆమె మామయ్య ధర్మేంద్ర యాదవ్ తెలిపారు. కాగా, 28 ఏండ్ల నవీన్ డెల్విన్​ది కేరళలోని ఎర్నాకుళం. ఇతను జేఎన్​యూలో రీసెర్చ్ స్టూడెంట్.

కోచింగ్ సెంటర్ నిర్వాహకుల అరెస్ట్​

సివిల్స్‌‌  అభ్యర్థుల మృతి ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు ఎఫ్‌‌ఐఆర్‌‌  నమోదు చేశారు. కోచింగ్ సెంటర్‌‌  యజమాని అభిషేక్ గుప్తా, కో ఆర్డినేటర్‌‌  దేశ్​పాల్ సింగ్​ను అరెస్టు చేశారు. వీరిపై హత్యానేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరామర్శించేందుకు వచ్చిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్​ను స్టూడెంట్లు అడ్డుకున్నారు. డ్రైనేజీ సిస్టమ్ బాగా లేదని పది రోజులుగా అధికారులకు చెప్తున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ స్పష్టం చేశారు. బేస్​మెంట్​లో ఉన్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని డివిజనల్ కమిషనర్​ను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారు. 

అసలేం జరిగింది?

ఓల్డ్ రాజేంద్రనగర్​లో శనివారం సాయంత్రం నుంచి భారీ వర్షం మొదలైంది. రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్​లోని బేస్​మెంట్​లో లైబ్రరీ ఉంది. 150 మంది వరకు కూర్చోవచ్చు. ఆ టైమ్​లో 18 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. వరద ఉధృతి కారణంగా బేస్​మెంట్ తలుపులు పగిలిపోయాయి. బయట ఉన్న స్టూడెంట్లు పోలీసులకు, మున్సిపల్ అధికారులకు 6.30 గంటలకు పరిస్థితి వివరించారు. వాళ్లు రాత్రి 9గంటలకు వచ్చారు. అప్పటికే బేస్​మెంట్​లో నీళ్లు నిండిపోయాయి. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సేఫ్టీ బృందం.. పది మోటార్లతో నీళ్లను బయటికి తోడటం మొదలుపెట్టారు. అతి కష్టం మీద 15 మందిని రెస్క్యూ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు ముగ్గురు స్టూడెంట్ల డెడ్​బాడీలను గుర్తించి బయటికి తీసుకొచ్చారు. వారిని తానియా, శ్రేయ, నవీన్​గా గుర్తించారు.

స్టూడెంట్లు చనిపోవడం బాధాకరం: రాహుల్ గాంధీ

వ్యవస్థల వైఫల్యం కారణంగానే ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు చనిపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. టౌన్​ప్లానింగ్, ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యమే దీనికి కారణమని తెలిపారు. వ్యవస్థల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నదని అన్నారు. ‘‘స్టూడెంట్లు చనిపోవడం చాలా దురదృష్టకరం. కొద్దిరోజుల కింద వర్షాలకు కరెంట్ షాక్​తో ఓ స్టూడెంట్ చనిపోయాడు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’అని అన్నారు.