- ప్రత్యక్షంగా వీక్షించడానికిచాలా మంది వస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి
- స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
హైదరాబాద్, వెలుగు: దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్కు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే ఈ మ్యాచ్కు సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా వచ్చి పరిశీలించారు. స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీస్, హెచ్సీఏ ఆఫీసర్లు డిప్యూటీ సీఎంకు వివరించారు.
మ్యాచ్ కోసం వచ్చి, వెళ్లే మార్గాలు, సీఎం, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ప్లేస్లు, క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను సంబంధిత శాఖల ఆఫీసర్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు.
కాగా, భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘మెస్సీ మ్యాచ్ అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ఫుట్ బాల్ ప్రేమికులు ఊగిపోతారు. ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుంది. ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడం కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రేక్షకులు రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు” అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సి సైతం ఆసక్తి చూపారని ఆయన పేర్కొన్నారు. ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట మంత్రి శ్రీధర్ బాబు, అడిషనల్ డీజీ విజయ్ కుమార్, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితరులు ఉన్నారు.
