శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకొని ఒకరిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న దాదాపు 15 మంది స్మగ్లర్లను టాస్క్ఫోర్స్ బృందం అడ్డుకుంది. టాస్క్ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాల ప్రకారం.. ఆర్ఎస్ఐ వాసు, డీఆర్వో నరసింహ రావు టీమ్ మంగళవారం అర్థరాత్రి శ్రీవారి మెట్టు వద్ద కూంబింగ్ చేస్తుండగా.. దాదాపు 15 మంది స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించడం కంటపడింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. స్మగ్లర్లు పారిపోయారు. స్మగ్లర్లను వెంబడించిన పోలీసులు చివరికి ఒక స్మగ్లర్ను పట్టుకోగలిగారు. అతని బ్యాగు చెక్ చేయగా.. అతని వద్ద మూడు జతల దుస్తులు లభించాయి. బస్సులో ప్రయాణించడానికి తెల్లటి దుస్తులు, తిరుమలలో తిరిగేందుకు భక్తుని తరహాలో కాషాయం రంగు దుస్తులు, అడవిలో సంచరించడానికి టీషర్టు, నెక్కర్ తెచ్చుకున్నాడు. ఇతన్ని తమిళనాడు, తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు సమీపంలోని వెళ్లిచెరువు గ్రామానికి చెందిన కే. వెంకటేశన్గా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో.. ఎర్రచందనం దుంగల కోసమే అడవిలోకి వచ్చినట్లు ఒప్పుకున్నాడు. వెంకటేశన్ను అరెస్టు చేసి.. టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
For More News..