
కలియుగ దేవుడు.. శ్రీనివాసుడు.. వెంకటేశ్వరస్వామి.. భక్తుల కోర్కెలు తీరుస్తాడని ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఏడుకొండలవాడికి కానుకలు సమర్పిస్తుంటారు. అందరి కోర్కెలు తీర్చే ఆ స్వామి హుండీని ఓ వ్యక్తి దొంగిలించాడు.. వైకుంఠనాథుడి క్షేత్రంలో పోలీసు బందోబస్తు.. సీసీ కెమెరాల నిఘా కట్టుదిట్టంగా ఉంటుంది. ఇదంతా .. ఆ తస్కరునికి తెలుసో .. తెలయదో కాని.. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో బంగారు బావి పక్కన టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన స్టీల్ హుండీని దొంగిలించిన వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకున్నారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తిరుమల హుండీలోని 4 వేల రూపాయిలను దొంగిలించాడు. ఈ ఘటనను గమనించిన సీసీటీవీ పర్యవేక్షణలో కమాండ్ & కంట్రోల్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆ దొంగ కదలికను కూడా సీసీటీవీ ద్వారా తెలుసుకున్న అధికారులు.. వెంటనే విజిలెన్స్ & సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుమల వన్ టౌన్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారని సీఐ విజయ్ కుమార్ తెలిపారు.