
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఆదివారం ( జులై 6) వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.
ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.