
ముంబై: టైటాన్ లిమిటెడ్ మార్చి 2023 క్వార్టర్లో రూ. 734 కోట్ల నికర లాభం సంపాదించింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లోని రూ. 491 కోట్లతో పోలిస్తే ఈ నికర లాభం 50 శాతం ఎక్కువ. షేర్ ఒక్కింటికి రూ. 10 చొప్పున డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డు రికమెండ్ చేసింది. ఈ ఏడాది క్యూ 4 లో ఆపరేషన్స్ రెవెన్యూ 33 శాతం అధికమై రూ. 9,704 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మార్చి క్వార్టర్లో ఇది రూ. 7,276 కోట్లు మాత్రమే.
టైటాన్ లిమిటెడ్ ఇబిటా తాజా క్యూ4 లో 37 శాతం పెరిగి రూ. 1,053 కోట్లుగా రికార్డవగా, ఇబిటా మార్జిన్లు సైతం 12 శాతం వద్ద నిలిచాయి. జ్యెయెలరీ బిజినెస్ రెవెన్యూ 24 శాతం పెరిగి రూ. 7,576 కోట్లకు, వెడ్డింగ్ సెగ్మెంట్ రెవెన్యూ రూ. 997 కోట్లకు, వాచెస్ అండ్ వేరబుల్స్ రెవెన్యూ 40 శాతం ఎక్కువై రూ. 871 కోట్లకు చేరినట్లు టైటాన్ లిమిటెడ్ తెలిపింది. 10 లక్షలకు పైగా స్మార్ట్ వాచీలను అమ్మినట్లు పేర్కొంది.
మార్కెట్ షేర్ పరంగా ఇండియాలోని టాప్ 5 స్మార్ట్ వాచ్ కంపెనీలలో ఒకటిగా టైటాన్ అవతరించింది. మరోవైపు ఐ కేర్ బిజినెస్ 25 శాతం గ్రోత్తో రూ. 165 కోట్లయినట్లు టైటాన్ పేర్కొంది. యాన్యువల్ కన్జూమర్ రిటెయిల్ సేల్స్పరంగా కిందటేడాది చాలా మైల్స్టోన్స్ అందుకున్నామని టైటాన్ వెల్లడించింది. అన్ని సెగ్మెంట్లలోనూ సంతృప్తికరమైన గ్రోత్ సాధించామని ఎండీ వెంకటరామన్ చెప్పారు. రిజల్ట్స్ ప్రకటన నేపథ్యంలో టైటాన్ షేర్లు 0.5 శాతం తగ్గి రూ. 2,651 వద్ద క్లోజయ్యాయి.