
- ఆంక్షలు లేవు.. నిఘా లేదు.. పాలన సాఫీగా సాగుతున్నది
- ప్రజలు నేరుగా ప్రజాభవన్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నరు
- కాంగ్రెస్లో మా పార్టీ విలీనం ఉండదు.. ఆ అవసరమే లేదు
- మాకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తమన్నరు.. మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే
- ప్రభుత్వాన్ని కూలగొడ్తామనేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు కరెక్ట్ కాదు
- ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్లకు లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నెత్తి మీద భారం దిగినట్లుగా ప్రజలంతా భావిస్తున్నారని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ‘‘ఆంక్షలు లేవు, నిఘా లేదు. ఎక్కడా చూసినా ప్రజలు ఉల్లాసంగా కనిపిస్తున్నరు. తమ సమస్యలను ప్రభుత్వానికి, అధికారులకు చెప్పుకుంటున్నరు. వాట్సప్ కాల్స్ వద్దు.. మామూలు కాల్స్ చేయండి అని అంటున్నరు. సీఎం, మంత్రులు, అధికారులు, విజిటర్స్ తో సెక్రటేరియెట్కళకళలాడుతున్నది” అని తెలిపారు.
రాష్ట్రంలో మార్పు కనిపిస్తున్నదని, పాలన సాఫీగా జరుగుతున్నదని, కొత్త తెలంగాణకు ఇదే మొదలు అని ఆయన పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వంలో చర్చలు, రివ్యూలు జరుగుతున్నయని అన్నారు. శనివారం ‘వీ6’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కోదండరాం పలు అంశాలపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇంత కాలం కొట్లాడినందుకు ఫలితం దక్కిందన్న సంతృప్తి కలుగుతున్నదని, గతంలో మాదిరి టెన్షన్ లేదని, రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
వీ6: గత 10 ఏండ్లలో ప్రజల దగ్గరకు వెళ్లారు. సమస్యలపై పోరాటాలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరనుకున్నట్లు పరిపాలన సాగుతున్నదా?
ప్రొఫెసర్ కోదండరాం: మేం అనుకున్నట్లు పాలన సాగుతున్నది. గతంలో సమస్యలపై మీటింగ్, ధర్నా చేయటానికి ప్లాన్ చేసుకునేవాళ్లం. ఇప్పుడేమో ప్రజా సమస్యలపై నేరుగా సీఎంను, మంత్రిని, సెక్రటరీని కలువొచ్చు. ఇది కొత్తగా కనిపిస్తున్నది.
అప్పుడు ప్రగతి భవన్.. ఇప్పుడు ప్రజా భవన్.. గేట్లు తీసేస్తే, ఫెన్సింగ్ తీసేస్తే.. మార్పు వచ్చినట్లేనా?
తీసేస్తే మార్పు అని కాదు. కట్టడి పోయిందనటానికి ఇది చిహ్నం. మంచి సంకేతాలను కొత్త ప్రభుత్వం జనంలోకి పంపించింది. కట్టడి ఉండదు.. సమస్యలు చెప్పుకోవచ్చు.. స్వేచ్ఛగా మాట్లాడొచ్చనే సిగ్నల్స్ పంపింది. మీడియా మీద ఆంక్షలు లేవు. ప్రజా భవన్ కు వచ్చి వినతిపత్రం ఇద్దామని పబ్లిక్ అనుకుంటున్నరు. గత బీఆర్ఎస్ హయాంలో సీపీఐ, సీపీఎం, మా పార్టీ నేతలు సీఎంను కలిసి వినతిపత్రం ఇద్దామనుకుంటే.. అక్కడికి వెళ్లనిస్తే కదా? చాడ వెంకటరెడ్డిని ఆయన ఆఫీసులో, నన్ను మా ఇంటి దగ్గర , సీపీఎం వాళ్లను వాళ్ల ఆఫీసు నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ లు చేసిన్రు. ఇప్పుడు అలాంటిది లేదు. సీఎం దగ్గరకు సులువుగా వెళ్లొచ్చు. ప్రజా సమస్యలపై మాట్లాడొచ్చు.
ప్రజా సమస్యలపై గత ప్రభుత్వంలో మంత్రులను కలిస్తే రియాక్షన్ ఎట్లుంటుండె?
గత ప్రభుత్వంలో మంత్రులకు ఎన్ని సమస్యలు చెప్పినా పరిష్కారం కాలేదు. సీఎం దృష్టికి తీసుకెళ్తాం అనేవాళ్లు. అట్ల వాళ్లు అన్నరంటే బుట్టదాఖలైనట్లే. ఒకవేళ వాళ్లు ధైర్యం చేసి కేసీఆర్ దగ్గరకు సమస్యలను తీసుకెళ్లినా ఆ సమస్యల పత్రం టేబుల్ మీదే ఉండేది. నాడు సీఎంకు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. పనులు చేసిపెడ్తమని, ఫైళ్లు కదిలిస్తం అని ఏజెంట్లు డబ్బులు వసూలు చేసెటోళ్లు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు ఎలా ఉండబోతున్నది? ఇప్పటికే రెండు స్కీమ్లు అమలు చేస్తున్నరు కదా.. వాటిపై మీ స్పందన ఏమిటి?
ఆరు గ్యారంటీలపై అప్లికేషన్లు తీసుకుంటున్నరు. మహాలక్ష్మి స్కీమ్ బాగుందని మహిళలు అంటున్నరు. ఫ్రీ బస్సు జర్నీతో చాలా మందికి ముఖ్యంగా రోజూ పనులకు వెళ్లేవాళ్లకు ఆసరా అవుతున్నది. ఆటో డ్రైవర్లకు ఉన్న ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నం. మహిళలకు వచ్చిన ఫ్రీ జర్నీ అవకాశాన్ని అందరూ అభినందించాలి. ఆరుగ్యారంటీల అమలు ప్రభుత్వానికి ఎక్కువ భారం మాత్రం కాదు.. దుబారా ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలను న్యాయం జరుగుతున్నదా?
అమరవీరులు కుటుంబాలు, ఉద్యమ కారులు సీఎంను కలుస్తామని అంటున్నరు. పండుగ తర్వాత వెళ్దామని చెప్తున్న. దావోస్ మీటింగ్, రివ్యూ మీటింగ్ లు, ఢిల్లీ మీటింగ్, లోక్ సభ ఎన్నికలు ఇలా సీఎం బిజీగా ఉన్నరు. తెలంగాణ అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు న్యాయం చేసే వర్క్ ప్రభుత్వంలో జరుగుతున్నది. న్యాయం జరుగుతుందని ఉద్యమకారులు కూడా భావిస్తున్నరు.
రాష్ట్రంలో విద్యా విధానం మారాలని మీరు, హరగోపాల్ అన్నరు. ఇటీవల అధికారుల భేటీలో ఏం సలహాలు ఇచ్చారు?
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కావాలని కోరాం. మౌళిక వసతులు కల్పించాలి. కార్పొరేట్ విద్యను నియంత్రించాలి. ఖాళీలు భర్తీ చేయాలి. ఫీజులను తగ్గించాలి. రాష్ట్ర అభివృద్ధికి ఇవన్ని పనికొస్తయ్. గతంలో వీసీల ఎంపిక కూడా సరిగా జరగలేదు. తప్పు చేస్తే అందరూ శిక్ష అనుభవిస్తరు.
కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లను ఎట్ల అర్థం చేసుకోవాలి?
బీఆర్ ఎస్ నేతల వైఖరి కరెక్టుగా లేదు. ప్రజల జడ్జిమెంట్ ను గౌరవించాలి. ఓటమిపై సమీక్ష చేసుకోవాలన్న, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సోయి వాళ్లలో కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని కూలగొడతం, మళ్లీ మేమే వస్తం అనే వ్యాఖ్యలు చేస్తున్నరు. ఇది కరెక్ట్ కాదు.
కాంగ్రెస్ శ్వేత పత్రాలు విడుదల చేసి తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీసిందన్న బీఆర్ ఎస్ కామెంట్లపై మీరేమంటరు?
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కొత్త ప్రభుత్వం సరిచేస్తున్నది. బీఆర్ఎస్ పాలకులు రూ.6 లక్షల కోట్ల అప్పులు చేశారు. విద్యుత్, ఇరిగేషన్ ఇలా అన్ని వ్యవస్ధలను నాశనం చేశారు. వ్యవస్థలను కుప్పకూల్చారు.
లోక్ సభ ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతున్నది?
కేంద్రంలో కూడా ప్రభుత్వం మారాలి. రైతు చట్టాలు, కార్పొరేట్లకు లబ్ధి, ఉద్యోగాల భర్తీ ఇలా ఎన్నో సమస్యలు ఉన్నయ్. లోక్సభ ఎన్నికలపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోరు ఎవరి మధ్య ఉంటుంది. బీఆర్ ఎస్ సీన్ లో లేదని.. బీజేపీకి, కాంగ్రెస్కు మధ్యేనని అంటున్నరు? కరెక్టేనా?
బీఆర్ ఎస్ అయితే వీక్గా ఉంది. ఇంకా ఆ ఎన్నికలపై అధ్యయనం చేయాలి.
కాంగ్రెస్ లో మీ పార్టీని విలీనం చేస్తరా? అది ఎప్పుడు?
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయం. ఆ అవసరం లేదు. మంచి జరగటానికి, తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ కు సహకారం అందించినం.
ఎమ్మెల్సీ హామీ వచ్చిందా..? మీకు విద్యా శాఖ మినిస్ట్రీ నిజమేనా?
మా పార్టీకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్లుగా ఇస్తున్నరు. 2 ఎమ్మెల్సీలు, కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పదవిపై చర్చ జరగలేదు. బయట మాత్రం చర్చ జరుగుతున్నది. దీనిపై మాట్లాడలేను.
మీరు ప్రభుత్వంలో ఉంటరా.. బయట ఉండి సలహాలు ఇస్తరా?
రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తం. ఏ రకంగా అవకాశం ఉంటే అట్ల పనిచేస్తం.
కేసీఆర్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఎట్లున్నది?
గత ప్రభుత్వం ప్రజలతో సంబంధం లేకుండా గుట్టుగా వ్యవహారాలు నడిపింది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి అనేది ఉండేది కాదు. ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు.. రెండు వేరు వేరు ప్రపంచాలు అన్న భావన ఉండేది. నాతో ఒక టీచర్ అన్న మాటలు గుర్తు చేస్తున్నా...‘‘మా సమస్య ఎవరికి చెప్పాల్నో తెలియదు, ఎవరికి చెప్తే పరిష్కారం అవుతుందో అర్థం కాదు. ఇది కేసీఆర్ పాలన’’ అని అన్నరు. ఇది నిజం. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. సీఎం, మంత్రులు, అధికారుల దగ్గరికి అందరూ వెళ్తున్నరు. తమ సమస్యలు చెప్పుకుంటున్నరు.
టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేస్తున్నరు కదా.. ఎలా ఉంటే మంచిది?
గైడ్ లైన్స్ కరెక్ట్ గా చేయాలి. రోస్టర్ పాయింట్లు సరి చేయాలి. కేరళలో ఉద్యోగి రిటైర్ మెంట్ అయిన మరుసటి రోజే కొత్త ఉద్యోగి జాబ్ లో చేరేలా జాబ్ క్యాలెండర్ ఖరారు చేశారు. యూపీఎస్సీ మచ్చ లేకుండా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. సర్వీసు రూల్స్ , మహిళ, క్యాస్ట్ రిజర్వేషన్లు ఇలా అన్ని మన దగ్గర సెట్ చేయాలి. లేకపోతే ఇబ్బందులు వస్తయ్.