- ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కు
- ఫేక్ డాక్యుమెంట్లతో కోట్లు నొక్కేశారు
హైదరాబాద్, వెలుగు: తిన్నింటి వాసాలనే లెక్కబెట్టారు బ్యాంకు మేనేజర్లు. పనిచేస్తున్న ఆఫీసులోనే కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఓ ప్రైవేట్ సంస్థతో కుమ్మక్కై నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి రూ.16 కోట్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్ మహబూబ్గంజ్ స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో జరిగింది. దానికి సంబంధించి శుక్రవారం ఆ బ్రాంచ్ మేనేజర్ల ఇళ్లలో సీబీఐ తనిఖీలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, మైసూరుల్లోని ఆరు ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.16 కోట్లకు సంబంధించిన లోన్లో అవకతవకలున్నట్టు రీజనల్ బిజినెస్ మేనేజర్ పి. రవికిరణ్ గుర్తించారు. రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆ సంస్థ డైరెక్టర్ అరుల్ ప్రకాశ్, మహ్మద్ అబ్దుల్ అజీజ్ బ్యాంక్ లోను తీసుకున్నట్టు ఆయన రికార్డుల్లో గుర్తించారు. వాళ్లతో కలిసి లోన్ అప్రూవల్కు బీఎం శశిశంకర్, చీఫ్ మేనేజర్ నాగేశ్వర్ శర్మ, ఆర్ఎం పవన్కుమార్లు కుట్ర పన్నారని గత ఏడాది డిసెంబర్ 31న సీబీఐకి ఫిర్యాదు చేశారు. చనిపోయిన రీన్ సంస్థ డైరెక్టర్ విజయ రాఘవేంద్ర తండ్రి పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చే శారన్నారు. సంస్థ ప్రతినిధులతో కలిసి రూ.16 కోట్లను మేనేజర్లు దారి మళ్లించా రని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీబీఐ శుక్రవారం హైదరాబాద్లోని మహ బూబ్గంజ్ బ్రాంచ్, మేనేజర్ల ఇళ్లు, బెంగళూరు, మైసూరులోని రీన్ లైఫ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసుల్లో సోదాలు చేసింది.