మత్తు పదార్ధాలకు బానిసలైన వారు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ మన శ్వాసవ్యవస్థను దెబ్బతీసి, ప్రాణాలనే హరిస్తున్నదని తెలిసిన విషయమే. అయితే, ఇది కొందరిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. గుట్కా, సిగెరెట్, హుక్కా, పాన్మసాలా.. లాంటి పొగాకు ఉత్పత్తులకు ఎవరైతే బానిసలుగా మారారో వారికి కరోనా ప్రాణాలు తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే సిగరెట్లను చేతితో పట్టుకుని పెదవుల దగ్గరకు తీసుకెళ్తారు.. ఇలా వైరస్ వారి నోట్లోకి చేరే అవకాశముంది. అలాగే, హుక్కా తాగేవారు ఒకే గొట్టాన్ని వాడుతారు. దీంతో వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.’ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నాలుగు ప్రధాన నాన్-కమ్యూనికేట్ డిసీజెస్ (ఎన్సీడీ) అయిన హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, డయాబెటిస్కు పొగాకు వాడకం ప్రధాన ప్రమాద కారకమని తెలుస్తోంది.
ఇక దేశంలోని మొత్తం మరణాల్లో 63 శాతం ఎన్సీడీ వల్లే సంభవిస్తున్నాయని వివరించింది. పొగాకులోని రసాయనాలు శరీరంలోని వివిధ రకాల రోగనిరోధక కణాల చర్యను అణిచివేస్తాయని, దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాబట్టి మత్తు పదార్ధాలకి దూరంగా ఉండాలని, తద్వారా కరోనా నుంచి సురక్షితంగా ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.