నేడు ఇంగ్లండ్తో ఫస్ట్ వన్డే
జోరుమీదున్న టీమిండియా
రివెంజ్ కోసం మోర్గాన్ టీమ్
టీమ్లోకి వచ్చిన కుర్రాళ్లంతా కుదురుకుంటున్నారు..! అవకాశం ఇచ్చిన ప్రతి ప్లేయర్ సత్తా చాటుతున్నాడు..! దీంతో సీనియర్ ప్లేయర్ల ఫ్యూచర్ డైలమాలో పడిన నేపథ్యంలో.. టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైంది..! నేటి నుంచి జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో ఇండియా.. వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది..! అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్కు ఈ సిరీస్ సవాల్గా మారింది..! యంగ్స్టర్స్కు చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్లు మరింత పెరగకముందే.. గబ్బర్ గాడిలో పడితే ఓకే... లేకపోతే అతని భవిష్యత్ ప్రమాదంలో పడటం ఖాయం..! ఎక్స్పీరియెన్స్ను పక్కనబెడితే.. శుభ్మన్ గిల్లాంటి యంగ్ టాలెంట్ను తట్టుకుని ధవన్ నిలబడతాడా? లేదా? చూడాలి..!
పుణె: వరుసగా రెండు సిరీస్లు గెలిచి జోరుమీదున్న ఇండియా.. కీలకమైన వన్డే పోరుకు సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్లో బలమైన ఇంగ్లండ్తో తలపడనుంది. టీ20 ప్రపంచకప్ ప్రిపరేషన్స్లో ఉన్న టీమిండియా.. ఈ ఫార్మాట్లోనూ రాణిస్తే ప్లేయర్లకు అదనపు ప్రయోజనం చేకూరుతుందని యోచిస్తున్నది. దీంతో పాటు ఇంగ్లిష్ టీమ్పై మూడో సిరీస్ను కూడా పట్టేయాలని టార్గెట్గా పెట్టుకుంది. మరోవైపు ఇంగ్లండ్ ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నది. చివరి అంకానికి చేరుకున్న టూర్కు విజయంతో ముగింపు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ను కూడా పెంచుకుని కొత్త స్ట్రాటజీలతో సిద్ధమైంది. ఓవరాల్గా ర్యాంకింగ్స్లోనూ టాప్ ప్లేస్లో ఉన్న ఇరుజట్లు.. గ్రౌండ్లోనూ అదే స్థాయిలో పోటీ ఇవ్వాలని ప్లాన్స్ వేస్తున్నాయి.
గబ్బర్పైనే అందరి దృష్టి..
టీమిండియా సంగతి ఎలా ఉన్నా.. ఈ సిరీస్ మాత్రం 35 ఏళ్ల శిఖర్ ధవన్కు కఠిన పరీక్షగా మారింది. మొతెరాలో జరిగిన ఫస్ట్ టీ20 తర్వాత గబ్బర్.. బెంచ్కే పరిమితమయ్యాడు. చాన్స్ ఇచ్చిన కుర్రాళ్లందరూ టీమ్లో కుదురుకోవడంతో ధవన్ను ఫైనల్ ఎలెవన్లోకి తీసుకునే అవకాశం లేకపోయింది. అయితే వన్డే ఫార్మాట్లో మాత్రం రోహిత్తో కలిసి ధవన్.. ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో ఈ అవకాశాన్నైనా అతను సద్వినియోగం చేసుకుంటాడా? లేదా? చూడాలి. ఎందుకంటే టీమ్లో ఉన్న గిల్తో పాటు బయటి నుంచి పృథ్వీ షా, పడిక్కల్.. ఓపెనింగ్ స్లాట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి వీళ్ల ఒత్తిడిని, టాలెంట్ను ఎదుర్కొని గబ్బర్ నిలబడతాడా? అన్నది ఆసక్తికరం. అయితే ఈ ఫార్మాట్లో చాలా ఎక్స్పీరియెన్స్ ఉండటం ధవన్కు కలిసొచ్చే అంశం. ఫస్ట్ మ్యాచ్లో సత్తా చాటితే రాబోయే మ్యాచ్ల్లో ఆడే అవకాశాలు పెరుగుతాయి. లేదంటే వేటు తప్పదు.
రాహుల్ వస్తాడా?
ఈ ఏడాది వన్డేలకు పెద్ద ప్రయారిటీ లేకపోయినా.. ఈ సిరీస్లో గెలవాలని ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. టీ20ల్లో రాణించిన కెప్టెన్ కోహ్లీ.. ఫామ్ కొనసాగించాలని భావిస్తోన్నాడు. 2019 తర్వాత ఈ ఫార్మాట్లో విరాట్ సెంచరీ చేయలేదు. దీంతో ఆ కరువు తీర్చుకోవాలని చూస్తున్నాడు. టాపార్డర్లో ప్లేస్ లేని కేఎల్ రాహుల్.. మిడిలార్డర్పై కన్నేశాడు. పంత్తో కలిసి భారీ ఇన్నింగ్స్కు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇద్దరూ మెరిస్తే భారీ స్కోరు ఖాయం. ఇక ఆల్రౌండర్ హార్దిక్.. ఫిఫ్త్ బౌలర్గా కీలకంకానున్నాడు. కానీ ఫుల్ కోటా వేస్తాడో లేదో చూడాలి. మరో ప్లేస్ కోసం శ్రేయస్, సూర్యకుమార్ మధ్య పోటీ నెలకొంది. పవర్ హిట్టింగ్ను పరిగణనలోకి తీసుకుంటే సూర్యకు చాన్స్ దక్కొచ్చు. భువనేశ్వర్ పేస్ అటాక్ను నడిపించనున్నాడు. శార్దూల్, నటరాజన్లో ఒకరు న్యూ బాల్ను షేర్ చేసుకోనున్నారు. కర్నాటక పేసర్ ప్రసిధ్ కృష్ణను ఆడించినాఆశ్చర్యం లేదు. స్పిన్నర్లుగా చహల్, సుందర్కే చాన్స్ కనిపిస్తున్నది.
ప్రతీకారమే లక్ష్యంగా..
ఇప్పటికే టెస్ట్, టీ20 సిరీస్ను కోల్పోయిన ఇంగ్లండ్ వన్డేల్లో నెగ్గి రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. అయితే ఈ సిరీస్లో ఇంగ్లండ్ ప్రభావం చూపాలంటే కెప్టెన్ మోర్గాన్ బ్యాట్తో రాణించాలి. బట్లర్, రాయ్, బెయిర్స్టో చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎంతమేరకు రాణిస్తాడన్న దానిపై విజిటింగ్ టీమ్ విక్టరీ చాన్సెస్ ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్లోనూ ఇంగ్లండ్ మెరుగ్గానే కనిపిస్తున్నది. కానీ గ్రౌండ్లో వాళ్ల ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. పేసర్ మార్క్ వుడ్ నుంచి ఇండియన్ బ్యాట్స్మెన్కు ఇబ్బందులైతే తప్పవు. ఆర్చర్ లేకపోవడం ప్రతికూలాంశం. జోర్డాన్, సామ్ కరన్ మెరిస్తే ఇంగ్లండ్కు కలిసొస్తుంది. మొయిన్ అలీ ప్లేస్పై గ్యారంటీ లేదు. కానీ పించ్ హిట్టర్గా చాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
జట్లు (అంచనా)
ఇండియా: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, శ్రేయస్, పంత్, రాహుల్ / క్రునాల్ / సుందర్, హార్దిక్, భువనేశ్వర్, శార్దూల్, చహల్ / కుల్దీప్, నటరాజన్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్స్టో, స్టోక్స్, బట్లర్, బిల్లింగ్స్, మొయిన్ అలీ / లివింగ్స్టోన్, సామ్ కరన్ / టామ్ కరన్, రషీద్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.
పిచ్, వాతావరణం
పుణె పిచ్ బ్యాట్స్మెన్కు అనుకూలం. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు వన్డేలు జరిగాయి. అన్నింటిలోనూ 300 ప్లస్ స్కోర్లను ఛేదించారు. మ్యాచ్కు వర్షం ముప్పులేదు.