- నేడు ఆస్ట్రేలియాతో ఇండియా సెకండ్ వామప్ మ్యాచ్
- ఫైనల్ బ్యాటింగ్ ఆర్డర్పై కోహ్లీ అండ్ కో దృష్టి
- రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో లైవ్
దుబాయ్: టీ20 వరల్డ్కప్ ప్రిపరేషన్స్ను విజయంతో ఆరంభించిన ఇండియా.. మెగా టోర్నీలో బరిలోకి దిగే ఫైనల్ బ్యాటింగ్ ఆర్డర్ను ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం బలమైన ఆస్ట్రేలియాతో సెకండ్ వామప్ మ్యాచ్ ఆడనుంది. ఫస్ట్ వామప్లో ఆడని ప్లేయర్లకు ఈ మ్యాచ్లో చాన్స్ ఇచ్చి తుది జట్టుపై ఓ అంచనాకు రావాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్గా విరాట్కు కోచ్గా రవిశాస్త్రికి ఈ టోర్నీ లాస్ట్ చాన్స్ కావడం.. ఓపెనింగ్ మ్యాచ్లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆడాల్సి రావడంతో బలమైన కాంబినేషన్తో బరిలోకి దిగాలని ఈ ఇద్దరూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇంగ్లండ్తో వామప్లో టాప్–3 లైనప్పై కోహ్లీ క్లారిటీ ఇచ్చినా మిడిలార్డర్ పరిస్థితి ఏంటనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఇషాన్ రాకతో..
ఫస్ట్ వామప్లో ఇషాన్ దుమ్మురేపడంతో ఫైనల్ ఎలెవన్ బ్యాటింగ్ ఆర్డర్పై డైలమా మొదలైంది. తొలి మ్యాచ్లో బ్రేక్ తీసుకున్న రోహిత్.. ఆసీస్పై బరిలోకి దిగనున్నాడు. సెకండ్ ఓపెనర్గా కేఎల్ రాహుల్, వన్డౌన్లో కోహ్లీ ప్లేస్లు ఖాయమయ్యాయి. అయితే నాలుగో నంబర్ కోసం పోటీ తీవ్రమైంది. వరుస హాఫ్ సెంచరీలతో హోరెత్తిస్తున్న ఇషాన్తో పాటు లైనప్లో ప్రమోట్ అయిన రిషబ్ పంత్, సూర్యకుమార్ కూడా రేస్లో ఉన్నారు. అయితే దుబాయ్ స్లో వికెట్పై సూర్య అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. ఇక వీటన్నింటికంటే అతి ముఖ్యంగా తేల్చాల్సిన ప్రధాన అంశం హార్దిక్ పాండ్యాను ఆడించటం. ఇంగ్లండ్తో మ్యాచ్లో బౌలింగ్కు దూరంగా ఉన్న పాండ్యా బ్యాటింగ్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే స్పెషలిస్ట్ బ్యాటర్గా అతన్ని కొనసాగిస్తారా? అన్నది తేలాలి. తను బౌలింగ్ చేయకపోతే ఆరో బౌలర్ ప్రత్యామ్నాయం కూడా అందుబాటులో ఉండదు. ఈ సమస్యల మధ్య కోహ్లీ దేనికి ఓటు వేస్తాడో చూడాలి.
శార్దూల్ వైపే మొగ్గు
బౌలింగ్లోనూ ఇండియా సరి చూసుకోవాల్సిన అస్త్రాలు చాలానే ఉన్నాయి. భారీ అంచనాలు పెట్టుకున్న స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ ఫస్ట్ మ్యాచ్లో విఫలంకావడం కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. షమీ మూడు వికెట్లు తీసినా, బుమ్రా తన మార్క్ను చూపెట్టలేకపోయాడు. దీంతో శార్దూల్ ఠాకూర్ను పూర్తిస్థాయిలో పరీక్షించేందుకు రెడీ అవుతున్నారు. రవీంద్ర జడేజా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఈ మ్యాచ్లో ఆడనున్నారు. ఓవరాల్గా అందుబాటులో ఉన్న ప్లేయర్లందర్ని బరిలోకి దించి బెటర్ కాంబినేషన్ను సిద్ధం చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ కసరత్తులు చేస్తోంది. 2016 టీ20 వరల్డ్కప్ నుంచి ఇప్పటివరకు 72 మ్యాచ్లు ఆడిన టీమిండియా 45 మ్యాచ్లు నెగ్గింది.