- వెలగపూడి సచివాలయంలో సమావేశమైన టికెట్ రేట్ల నిర్ధారణ కమిటీ
అమరావతి: వెలగపూడి సచివాలయంలో సినిమా టికెట్ రేట్ల నిర్దారణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు సమావేశమై చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఇవాళ బుధవారం మూడోసారి సమావేశం కావడంతో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం కోర్టుకు అందజేయనుంది.
హోమ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ నేతృత్వం లో 13 మందితో కమిటీ సమావేశమై చర్చలు జరుపుతోంది.
కమిటీ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ రాందాస్, వేమూరి బలరత్నం,ఎగ్జిబిటర్ వడ్డే ఓం ప్రకాష్, CBFC మెంబర్ గంపా లక్ష్మీ, ప్రేక్షకుల సంఘం, ఇతర సభ్యులు హాజరైనట్లు సమాచారం. గత సమావేశంలో బి,సి సెంటర్లలో రేట్లను మార్పు, థియేటర్లలో వసతులు, ఫైర్ నిబంధనలపై చర్చ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో తిను బండారాలు, ఆహార పదార్థాలను అధిక ధరలకు అమ్ముతుండడం, టాయిలెట్ల నిర్వహణపై ఇప్పుడు మరో సారి చర్చ జరుగుతోంది.