తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : రాహుల్​ గాంధీ

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే : రాహుల్​ గాంధీ
  • రేవంత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలె       
  • కామారెడ్డి సభలో రాహుల్​గాంధీ

కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: రాష్ట్రంలో ఈ సారి వచ్చేది కాంగ్రెస్ ​ప్రభుత్వమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆదివారం కామారెడ్డిలోని గవర్నమెంట్​డిగ్రీ కాలేజ్​ గ్రౌండ్​లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్​గాంధీ పాల్గొన్నారు. తెలంగాణలో ఈ సారి దొరల అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 

ఈ పోరులో అంతిమ విజయం ప్రజలదేనన్నారు. కామారెడ్డిలో రేవంత్​రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్​ కామారెడ్డికి రావడం వెనుక దాగి ఉన్న కుట్రను గమనించాలని కోరారు. ఇక్కడి విలువైన భూములపై కేసీఆర్​ కన్ను పడిందని, వాటిని దోచుకోడానికే వస్తున్నారన్నారు. ​40 ఏండ్లుగా రాజకీయంలో ఉన్న కేసీఆర్​కు ఇయ్యాల అమ్మమ్మ ఊరు కోనాపూర్ ​గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్న పాపన పోలేదన్నారు. దేశమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, ఇక్కడి ప్రజలు ఇవ్వబోయే తీర్పు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నారు. 

కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించేందుకే అధిష్టానం తనను ఇక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించిందన్నారు. కేసీఆర్​ను ఓడించి కాంగ్రెస్​ను గెలిపించాలని కోరారు. సభలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, మాణిక్​రావు ఠాక్రే, అర్బన్​అభ్యర్థి షబ్బీర్​అలీ, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అభ్యర్థులు మదన్​మోహన్​రావు, ఏనుగు రవీందర్​రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ ​కైలాస్​ శ్రీనివాస్​రావు, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్​అలీ, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి,  మున్సిపల్​ వైస్​చైర్​పర్సన్ ​ఇందుప్రియ, టౌన్​ ప్రెసిడెంట్​ పండ్ల రాజు, లీడర్లు అశోక్​రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, చంద్రకాంత్​రెడ్డి, గొనే శ్రీనివాస్,​ వేణుగోపాల్​రెడ్డి పాల్గొన్నారు.

సభ సక్సెస్​తో శ్రేణుల్లో జోష్​

కామారెడ్డిలో రాహుల్​సభ సక్సెస్​ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ నిండింది. కామారెడ్డి నియోజకవర్గంలోని ఆయా గ్రామాలు, టౌన్​ల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చారు. రాహుల్​గాంధీ తన ప్రసంగంలో బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు ఎక్కుపెట్టి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది వివరించారు.