- కొత్త జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్తో కలిసి ఏర్పాటు చేస్తున్న జాయింట్ వెంచర్ కంపెనీలో టోటల్ ఎనర్జీస్ 300 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెడుతోంది. అదానీ గ్రూప్పై షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తర్వాత ఈ ఫ్రెంచ్ కంపెనీ మొదటి పబ్లిక్ డీల్ ఇదే కావడం విశేషం. కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో టోటల్ ఎనర్జీస్కు 50 శాతం వాటా, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు 50 శాతం వాటా ఉంటాయి. రెండు కంపెనీలు కలిసి ఈ మేరకు ఒక ప్రకటన చేశాయి. జాయింట్ వెంచర్ కంపెనీ కింద 1,050 మెగావాట్ల కెపాసిటీ పోర్ట్ఫోలియో ఉండనుంది. ఇందులో 300 మెగావాట్ల కెపాసిటీ ఇప్పటికే ఆపరేషనల్ అయింది. మరో 500 మెగావాట్ల కెపాసిటీ నిర్మాణంలో ఉందని, కొత్తగా 250 మెగావాట్ల విండ్పవర్, సోలార్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తామని ఈ కంపెనీలు వెల్లడించాయి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెంచే దిశలోనే ఈ జాయింట్వెంచర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు టోటల్ ఎనర్జీస్ తెలిపింది. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో టోటల్ ఎనర్జీస్కు ఇప్పటికే 19.7 శాతం వాటా ఉంది.
ఏజీఈ23ఎల్ పేరుతో రెండు కంపెనీలకు సమానవాటాతో ఒక జాయింట్ వెంచర్ కూడా కొనసాగుతోంది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీకి 2,353 మెగావాట్ల పోర్ట్ఫోలియో ఉంది. టోటల్ ఎనర్జీస్తో కొత్త జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుపై స్టాక్ఎక్స్చేంజీలకు అదానీ గ్రూప్ సమాచారం ఇచ్చింది. అదానీ గ్యాస్ లిమిటెడ్లో 2019 లోనే టోటల్ ఎనర్జీస్ 600 మిలియన్డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడితో 37.4 శాతం వాటా పొందింది. ఈ కంపెనీని ఇప్పుడు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్గా వ్యవహరిస్తున్నారు. అదానీ గ్రూప్తో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును టోటల్ ఎనర్జీస్ చేపడదామనుకుంది. కానీ, హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో ఆ ప్రపోజల్ ముందుకు సాగలేదు.