- రెండు చోట్లా బరిలో బలమైన అభ్యర్థులు
- గజ్వేల్లో బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి నర్సారెడ్డి
- కామారెడ్డిలో కాంగ్రెస్ నుంచి రేవంత్, బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి
- ఎన్నికల్లో ఇవే హాట్ సీట్లు.. అందరి దృష్టి వీటిపైనే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హాట్ సీట్లయిన కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో పోరు ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సీట్ల నుంచి బరిలో నిలిచిన సీఎం కేసీఆర్కు గట్టి పోటీ ఎదురవుతున్నది. గజ్వేల్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన ఆయన.. ఈ సారి కొత్తగా కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఆయనకు షాక్ ఇచ్చేలా ప్రతిపక్షాలు ఆ రెండు చోట్లా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. గజ్వేల్లో కేసీఆర్తో పోరుకు మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి సిద్ధమయ్యారు. ఇక కామారెడ్డిలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి ఢీకొడుతున్నారు.
గజ్వేల్.. సేఫ్ సీటేనా?
2014, 2018 ఎన్నికల్లో వంటేరు ప్రతాపరెడ్డిపై కేసీఆర్ విజయం సాధించారు. గత ఎన్నికల తర్వాత వంటేరు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కేసీఆర్ ఘన విజయం ఖాయమేనని బీఆర్ఎస్ నేతలు భావించారు. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగడంతో.. గజ్వేల్ సెగ్మెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. తనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, పార్టీ నుంచి వెళ్లగొట్టినప్పటి నుంచీ కేసీఆర్పై పోటీ చేస్తానంటూ ఈటల పలుమార్లు చాలెంజ్ చేశారు. అన్నట్లుగానే హుజూరాబాద్తోపాటు గజ్వేల్ నుంచి బరిలోకి దిగారు. మొత్తంగా గజ్వేల్లో 44 మంది పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక అభ్యర్థులు పోటీ పడుతున్న సెగ్మెంట్లలో ఇది రెండోది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గజ్వేల్లో రూ.వేల కోట్లను సీఎం కేసీఆర్ వెచ్చించారని, దీంతో గజ్వేల్ రూపు రేఖలు మారిపోయాయని, అభివృద్ధితో పాటు సీఎం ఇమేజీ లక్ష ఓట్ల మెజారిటీ తెచ్చిపెడుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. తనకు గతంలో గజ్వేల్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంబంధాలు, బీసీ వర్గాల ఓట్లు, కేసీఆర్పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని ఈటల భావిస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి, దళితులకు ఇచ్చిన హామీలన్నీ ఫెయిలవటం, నిర్వాసితుల్లో ఉన్న అసంతృప్తితో పాటు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తనకు ఓట్లు తెచ్చిపెడుతాయని కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి ధీమాతో ఉన్నారు.
కామారెడ్డిలో హాట్ కంటెస్ట్
కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయటం ఇదే తొలిసారి. ఎన్నికల షెడ్యూలు రాకముందే కామారెడ్డి అభివృద్ధికి కేసీఆర్ భారీగా నిధులు కేటాయించారు. ఇక్కడ సిట్టింగ్ను కాదని ఆయన బరిలోకి దిగారు. తీరా నామినేషన్ల టైమ్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నిలబెట్టింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వెంకట రమణారెడ్డికి బీజేపీ మరోసారి టికెటిచ్చింది. వీరితో పాటు మొత్తం 39 మంది ఇక్కడ పోటీలో ఉన్నారు. కామారెడ్డి చుట్టూ తొమ్మిది గ్రామాల పరిధిలో మాస్టర్ ప్లాన్ అమలుకు మున్సిపల్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నోటిఫికేషన్ గత ఏడాది దుమారం రేపిన విషయం తెలిసిందే. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా కామారెడ్డి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళన రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. అప్పుడు మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఇంకా చల్లారలేదు. ఈ నేపథ్యంలో గజ్వేల్లో రైతుల భూములను లాక్కున్న కేసీఆర్.. ఇక్కడి రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకే కామారెడ్డి వచ్చాడంటూ రేవంత్ ఎంచుకున్న ప్రచారాస్త్రం హాట్ టాపికైంది. కేసీఆర్, రేవంత్రెడ్డి నాన్లోకల్స్ అని.. తానొక్కడినే లోకల్ అంటూ బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ప్రచారం చేస్తున్నారు. నాలుగేండ్లుగా జనంలో ఉండటం ఆయనకు ప్లస్. మాస్టర్ ప్లాన్, ధరణి సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలపై ఇక్కడ జరిగిన పోరాటాలన్నింటిలో వెంకటరమణారెడ్డి కీలక పాత్ర పోషించారనే పేరుంది.