మహబూబ్నగర్, వెలుగు : కురుమూర్తి, మన్నెంకొండ, పిల్లలమర్రి ప్రాంతాలను కలుపుతూ పర్యాటక సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పాలమూరును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.2.5 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. మహబూబ్నగర్ నగరంలోని పిల్లలమర్రిని ఆయన సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మయూరి పార్క్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ట్రెక్కింగ్ ట్రైళ్లు, వ్యూ పాయింట్లు, పర్యాటకుల కోసం తాత్కాలిక కాటేజీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణ పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని పురాతన ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దాదాపు 150 పనులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించగా, ఆమోదం తెలిపినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
