శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి..

శ్రీశైలం ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి..

శ్రీశైలం ప్రాజెక్టు అందాలు కనువిందు చేస్తున్నాయి. 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో.. డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.  కృష్ణమ్మ పరవళ్లను చూసి ప్రకృతి ప్రేమికులు పరవశించిపోతున్నారు.  సుందర దశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తూ..ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. ఆధ్యాత్మికతతో పాటు అహ్లాదవాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 

శ్రీశైలం గేట్లు ఎత్తారన్న సమాచారంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ నుంచి  పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు.  దీనికి తోడు శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది.   శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తారు. పర్యాటకుల రద్దీతో శ్రీశైలం డ్యామ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. 

ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది.  ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేయడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. పైన ఉన్న  జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి 3 లక్షల 63వేల 157 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకలి వస్తుండగా.. 3 లక్షల 76వేల 670 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇక  శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885.80 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.4 అడుగుల వరకు నీరుంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 212.43 నీరు నిల్వ ఉంది.