
వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఉంటుందా ? పోతుందా ?! ఇప్పుడు రాజకీయ నాయకుల్లో జరుగుతున్న చర్చ ఇది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేందుకు క్యూ కడుతుండడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా కలవరపడుతున్నారు. ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావుతో మొదలైన ఫిరాయింపులు చిరుమర్తి లింగయ్య, హరి ప్రియా నాయక్ వరకు చేరుకుంది. అదే వరుసలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తోపాటు మరో నలుగురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ కు నలుగురు గుడ్ బై చెప్పడంతో ఆ సంఖ్య 15 కు పడిపోయింది. అసెంబ్లీలో కాం గ్రెస్ ప్రతిపక్ష హోదా కాపాడుకోవాలంటే 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా పార్టీ మారేందుకు సిద్ధం గా ఉన్నారని కాం గ్రెస్లోనే ప్రచారం జరుగుతోంది. ఆ ఐదుగురు టీఆర్ఎస్లో చేరితే.. కాంగ్రెస్ బలం 10 కి పడిపోతుంది. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షహోదా గల్లంతవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మండలిలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా ను కోల్పోయింది. అక్కడ షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరి పదవీ కాలం ఈ నెలతో ముగియనుండటంతో కౌన్సిల్ లో కాంగ్రెస్ కు ప్రాతినిథ్యం లేకుండా పోనుంది.