శివ్వంపేట, వెలుగు: శివ్వంపేటలోని భగలాముఖి అమ్మవారి శక్తిపీఠం ఆలయంలో మంగళవారం యాగశాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. ఆలయ వ్యవస్థాపకుడు వేంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, హోమంలో పాల్గొన్నారు.
మాజీ జడ్పీటీసీ మహేశ్ గుప్తా, స్థలదాత రమేశ్ గుప్తా ఆయనను శాలువాతో సన్మానించారు. అంతకు ముందు నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వందకు పైగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి టీపీసీసీ అధ్యక్షుడికి గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ఈ గ్రామం పెద్ద పుణ్యక్షేత్రంగా మారుతుందన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్సుహాసిని రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు కరుణాకర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గణేశ్ గౌడ్, శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, శ్రీధర్ గుప్తా పాల్గొన్నారు..
కాంగ్రెస్ ఇరువర్గాల తోపులాట
మహేశ్ కుమార్ గౌడ్ పర్యటన సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలోని ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పీసీసీ అధ్యక్షుడి కాన్వాయ్ వస్తుండగా డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నియోజక వర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని నాయకులను, కార్యకర్తలను సముదాయించి మహేశ్ కుమార్ గౌడ్ కాన్వాయ్ ఆలయానికి పంపించారు.
