అల్వాలలో రోటవేటర్​లో పడి బాలుడు మృతి

అల్వాలలో రోటవేటర్​లో పడి బాలుడు మృతి
  • సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాలలో ఘటన

దుబ్బాక, వెలుగు: ట్రాక్టర్​ రోటవేటర్​లో పడి ఐదేండ్ల బాలుడు చనిపోయాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామానికి చెందిన బీడ లావణ్య, కనకయ్య దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. కనకయ్య గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. అలాగే తన ట్రాక్టర్​తో తన భూమిని దున్నుకుంటూ, గ్రామంలో కిరాయికి వెళ్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం భార్య లావణ్య, చిన్న కొడుకు నికాస్(5)తో కలిసి పొలానికి వెళ్లాడు.

నికాస్​ను​ ట్రాక్టర్​పై కూర్చోబెట్టుకొని పొలాన్ని దున్నుతుండగా, బాలుడు ప్రమాదవశాత్తు రోటోవేటర్​లో పడ్డాడు. గమనించిన కనకయ్య ట్రాక్టర్​ ఆపి కొడుకును బయటకు తీయగా, కాలు విరిగి, ముఖం నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.