
న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్ పెరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఎలక్షన్స్, ఎర్నింగ్స్ సీజన్ చివరి దశలో ఉండడంతో వొలటాలిటీ ఉన్నా మార్కెట్ కొద్ది కొద్దిగా ముందుకెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. విదేశీ ఇన్వెస్టర్ల యాక్టివిటీ, గ్లోబల్ ట్రెండ్స్పై ఫోకస్ పెట్టాలని ట్రేడర్లకు సలహా ఇచ్చారు. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ కిందటి వారం రికార్డ్ ర్యాలీ చేసిన విషయం తెలిసిందే.
సెన్సెక్స్ 1,404 పాయింట్లు (1.89 శాతం) పెరగగా, నిఫ్టీ 455 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23 వేల లెవెల్ను మొదటిసారిగా టచ్ చేసింది. గురువారం మంత్లీ డెరివేటివ్స్ ఎక్స్పైరీ ఉండడంతో వొలటాలిటీ పెరగొచ్చని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. టాటా స్టీల్ వంటి కొన్ని కంపెనీల రిజల్ట్స్ ఈ వారం ఉన్నాయని, ఫలితాలు మెరుగ్గా ఉంటే మార్కెట్ పాజిటివ్గా కదలొచ్చని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలకు చేరువయ్యామని, ఎఫ్ఐఐల ఇన్ఫ్లోస్ రిజల్ట్స్పై ఆధారపడతాయని పేర్కొన్నారు. కాగా, జూన్ 4 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ వారం మార్చి క్వార్టర్కు గాను ఇండియా జీడీపీ డేటా వెలువడనుంది. ఎల్ఐసీ, ఎన్ఎండీసీ, ఐఆర్సీటీసీ, ఎంఎంటీసీ తమ మార్చి క్వార్టర్ ఫలితాలను ఈ వారం ప్రకటించనున్నాయి.