ఏపీ, కర్నాటక నుంచే.. పత్తి విత్తనాల దందా

ఏపీ, కర్నాటక నుంచే.. పత్తి విత్తనాల దందా
  •     ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి జర్మినేషన్ ఫెయిల్డ్​ సీడ్స్​
  •     భారీ మొత్తంలో రైతులకు అంటగడ్తున్న వ్యాపారులు
  •     మే నెలలో చల్లేందుకు కొని స్టాక్ పెట్టుకుంటున్న రైతులు

మహబూబ్​నగర్, వెలుగు: రాష్ట్రంలోకి నిషేధిత బీటీ- –3, జర్మినేషన్​ టెస్టులో ఫెయిల్​ అయిన పత్తి విత్తనాలు వస్తున్నాయి ప్రధానంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్​రాష్ర్టాల నుంచి బీటీ-–3, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఫెయిల్యూర్​ ​సీడ్స్​ను తెప్పిస్తున్న వ్యాపారులు, సీడ్ ​ఆర్గనైజర్లు రైతులకు అంటగడుతూ మోసగిస్తున్నారు. మే నెల చివరి వారం నుంచి పత్తి విత్తనాలు చల్లుకునే టైం మొదలు కానుండడంతో, గ్రామాల్లో ఇప్పటికే ఈ విత్తనాలను కొని రైతులు స్టాక్​ పెట్టుకున్నారు. ఒకవేళ ఈ విత్తనాలను వాడితే భారీ ఎత్తున నష్టపోయే అవకాశాలుంటాయి.  

మూడు జోన్లుగా డివైడ్ ​చేసి బిజినెస్​

రాష్ట్రంలో వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే పంట పత్తి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50,59,225 ఎకరాలు కాగా, గత వానాకాలంలో 44,77,937 ఎకరాల్లో సాగు చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా అత్యధికంగా ఆదిలాబాద్​లో 10.45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, నల్లగొండలో 7.57 లక్షలు, మహబూబ్​నగర్​లో 6.67 లక్షలు, వరంగల్​లో 5.26 లక్షలు, మెదక్​లో 5.04 లక్షలు, ఖమ్మంలో 3.83 లక్షలు, రంగారెడ్డిలో 3.89 లక్షలు, కరీంనగర్​లో 1.72 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. అయితే విత్తన వ్యాపారులు, సీడ్​ఆర్గనైజర్లు పత్తి సాగవుతున్న ఏరియాలను జోన్లుగా విభజించి ఈ ప్రాంతాల్లోని మార్కెట్లలోకి బీటీ–-3, ఫెయిల్యూర్​ సీడ్స్​ను పంపించి రైతులకు అంటగడుతున్నారు. 

మహబూబ్​నగర్​, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్​ ఉమ్మడి జిల్లాలను ఒక జోన్​గా, ఆదిలాబాద్​, వరంగల్​, కరీంనగర్​జిల్లాలను మరో జోన్​గా.. ఖమ్మం, నిజామాబాద్​జిల్లాలను ఇంకో జోన్​గా ఏర్పాటు చేసుకొని ఏజెంట్ల ద్వారా దందా సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్​ప్రాంతాలకు బీటీ-–3 విత్తనాలను కర్ణాటకలోని గుర్మిట్కల్, రాయచూర్, ఆంధ్రప్రదేశ్​లోని కర్నూల్, నంద్యాల ప్రాంతాల నుంచి తెప్పించుకొని రైతులకు చేరవేస్తున్నారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్​ ప్రాంతాలకు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూల్, కృష్ణా జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట, గుజరాత్​ రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొని అమ్ముతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం సర్టిఫై చేసిన మేలు పత్తి విత్తనాల ప్యాకెట్​ (450 గ్రామాలు) ఒకటి రూ.740 నుంచి రూ.860 వరకు దొరుకుతుండగా, నిషేధిత బీటీ–-3 కిలో విత్తనాలను డిమాండ్​ను బట్టి వ్యాపారులు రూ.1,300 నుంచి రూ.1,500 వరకు 
అమ్ముతున్నారు.

నడిగడ్డ కేంద్రంగా ఫెయిల్యూర్​ సీడ్ ​దందా

పత్తి విత్తన కంపెనీలు, రైతులకు మీడియేటర్లుగా ఉన్న సీడ్‌‌ ఆర్గనైజర్లు నడిగడ్డ కేంద్రంగా ఫెయిల్యూర్​ సీడ్స్​ దందా నిర్వహిస్తున్నారు. కంపెనీలు తయారు చేసిన విత్తనాలను సీడ్‌‌ ఆర్గనైజర్లకు అందజేస్తుండగా..వారు ఈ విత్తనాలను సాగు కోసం రైతులకు ఇస్తున్నారు. రైతులు సాగు చేసిన ఈ విత్తనాలను ఆర్గనైజర్లు తిరిగి సేకరించి..ఆయా కంపెనీలకు అందజేస్తారు. ఈ విత్తన శాంపిల్స్​కు కంపెనీలు జర్మినేషన్ ​టెస్ట్​ నిర్వహిస్తాయి. మొలక శాతం తగినంత లేని వాటిని ఫెయిల్యూర్​ విత్తనాలుగా గుర్తించి తిరిగి ఆర్గనైజర్లకు ఇస్తాయి. 

ఈ విత్తనాలను ఆర్గనైజర్లు రైతులకు ఇస్తే వారు పగలగొడతారు. ఇక్కడే సీడ్​ఆర్గనైజర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫెయిల్యూర్​ సీడ్స్​ను రైతులకు ఇవ్వకుండా నేరుగా గద్వాల, భూత్పూర్‌‌, హైదరాబాద్‌‌ శివార్లలోని పత్తి విత్తన శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కంపెనీల స్టిక్కర్లు ముద్రించిన ప్యాకెట్లలో సీడ్స్​ను నింపి బహిరంగ మార్కెట్లలోకి పంపుతున్నారు. కర్ణాటక, ఏపీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ సర్టిఫైడ్​ విత్తనాలకంటే చాలా చౌకగా ఈ విత్తనాలను అమ్ముతున్నారు. 450 గ్రాముల విత్తనాల ప్యాకెట్​ఒకదానికి ఏరియాను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు అమ్ముతున్నారు.

ఇప్పటికే 60 శాతం ఫెయిల్యూర్​  సీడ్స్​ కొన్న రైతులు

టాస్క్​ఫోర్స్​ దాడుల భయంతో వ్యాపారులు, సీడ్​ ఆర్గనైజర్లు బీటీ-3, ఫెయిల్యూర్​ సీడ్స్​ను  ఫిబ్రవరి నెల నుంచే మార్కెట్లలోకి తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 60 శాతం విత్తనాలను రైతులు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రధానంగా ఈ సీజన్​లో మే చివరి వారం నుంచి తొలకరి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పత్తి సాగుకు సిద్ధమవుతున్న రైతులు ముందుగానే విత్తనాలను కొని గ్రామాల్లో స్టాక్​ చేసి పెట్టుకున్నట్టు తెలిసింది.