
- ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి
- మరో ఇద్దరికి గాయాలు
- అర్ధరాత్రి బిర్యానీ కోసం
- వెళ్తుండగా ప్రమాదం
- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
- ఘట్ కేసర్ ఏరియాలో ఘటన
ఘట్కేసర్, వెలుగు: వీకెండ్ పార్టీ విషాదంగా మారింది. యాక్సిడెంట్ లో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడిన ఘటన మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మల్కాజిగిరి సైనిక్పురికి చెందిన వర్షిత్(22), రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్(23), ఓల్డ్ అల్వాల్కు చెందిన ప్రవీణ్, వైజాగ్కు చెందిన దినేశ్ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. శుక్రవారం ఘట్కేసర్ పరిధి ఎదులాబాద్ సమీపంలోని విహారి ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
నలుగురూ కలిసి కారులో అర్ధరాత్రి బిర్యానీ కోసం ఎదులాబాద్ నుంచి ఘట్కేసర్ కు వెళ్తున్నారు. మార్గమధ్యలో మాధారం క్రాస్ రోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వర్షిత్, భార్గవ్ స్పాట్ లో చనిపోయారు. కారు నడుపుతున్న ప్రవీణ్తీవ్రంగా, దినేశ్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి డెడ్బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశు రామ్ తెలిపారు.