హైదరాబాద్ లో వీకెండ్ పార్టీలో విషాదం

హైదరాబాద్ లో  వీకెండ్ పార్టీలో విషాదం
  • ఇద్దరు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు మృతి
  • మరో ఇద్దరికి గాయాలు       
  • అర్ధరాత్రి బిర్యానీ కోసం 
  • వెళ్తుండగా ప్రమాదం
  • మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా 
  • ఘట్ కేసర్ ఏరియాలో ఘటన 

ఘట్​కేసర్, వెలుగు: వీకెండ్ పార్టీ విషాదంగా మారింది. యాక్సిడెంట్ లో ఇద్దరు సాఫ్ట్​వేర్ ఉద్యోగులు చనిపోగా.. మరో ఇద్దరు గాయపడిన ఘటన మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలో జరిగింది.  పోలీసులు తెలిపిన ప్రకారం.. మల్కాజిగిరి సైనిక్​పురికి చెందిన వర్షిత్(22), రంగారెడ్డి జిల్లా కుంట్లూరుకు చెందిన భార్గవ్ యాదవ్(23), ఓల్డ్ అల్వాల్​కు చెందిన ప్రవీణ్, వైజాగ్​కు చెందిన దినేశ్​ఒకే సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగులుగా పని చేస్తున్నారు. శుక్రవారం ఘట్​కేసర్ పరిధి ఎదులాబాద్ సమీపంలోని విహారి ఫామ్ హౌస్ లో వీకెండ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

 నలుగురూ కలిసి కారులో అర్ధరాత్రి బిర్యానీ కోసం ఎదులాబాద్ నుంచి ఘట్​కేసర్​ కు వెళ్తున్నారు.  మార్గమధ్యలో మాధారం క్రాస్ రోడ్డు వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వర్షిత్, భార్గవ్ స్పాట్ లో చనిపోయారు. కారు నడుపుతున్న ప్రవీణ్​తీవ్రంగా, దినేశ్ కు స్వల్ప గాయాలయ్యాయి.  స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  ఇద్దరి డెడ్​బాడీలను పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పరుశు రామ్​ తెలిపారు.