ఇది డిఫాల్ట్ సర్వీస్ ప్రకటించిన ట్రాయ్, డాట్
న్యూఢిల్లీ: ఇక నుంచి మన మొబైల్ఫోన్కు కాల్ చేసే వాళ్ల పేరు, వివరాలు తెలుసుకోవడానికి ట్రూకాలర్వంటి థర్డ్పార్టీ యాప్స్ను వాడాల్సిన అవసరం ఉండదు. ఫోన్ స్క్రీన్పైనే కాలర్ పేరు కనిపించనుంది. ఈ సర్వీసును డిఫాల్ట్గా అందించాలని టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టాయ్), డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్) నిర్ణయించాయి. సిమ్ కనెక్షన్ కోసం ఉపయోగించిన గుర్తింపు కార్డులోని పేరే ఫోన్లో కనిపిస్తుంది. దీనినే కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ అంటారు.
గత ఫిబ్రవరిలో ట్రాయ్ 'ఇంట్రడక్షన్ ఆఫ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) ఇన్ టెలికమ్యూనికేషన్ నెట్వర్క్స్'పై డాట్కి సిఫార్సులు చేసింది. ఈ సర్వీసును కాల్ స్వీకరించే సబ్స్క్రయిబర్ కోరితేనే యాక్టివేట్ చేయాలని ట్రాయ్ సూచించింది.
డాట్ ఈ సిఫార్సును తోసిపుచ్చింది. సీఎన్ఏపీ సర్వీసును డిఫాల్ట్గా మార్చాలని కోరింది. అవసరం లేదనుకునే వాళ్లు ఈ ఆప్షన్ను డిసేబుల్ చేసుకునే అవకాశం ఉండాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు డాట్ఒప్పుకుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు వంటి మోసపూరిత కాల్స్ నుంచి సబ్స్క్రైబర్లను రక్షించడానికి ఈ సీఎన్ఏపీ సేవను ప్రారంభించే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది.
కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ రెస్ట్రిక్షన్ (సీఎల్ఐఆర్) సదుపాయాన్ని పొందిన టెలిఫోన్ సబ్స్క్రయిబర్ల పేర్లను చూపించకూడదన్న ట్రాయ్ సిఫార్సును డాట్ అంగీకరించే అవకాశం ఉంది. సీఎల్ఐఆర్ సదుపాయం సాధారణ సబ్స్క్రయిబర్లు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అధికారులు, ప్రముఖులకు అందుబాటులో ఉంటుంది. బల్క్ కనెక్షన్లు, కాల్సెంటర్లు, టెలిమార్కెటర్లకు ఈ సదుపాయం వర్తించదు.
2జీ, 3జీ యూజర్లకు బ్యాండ్విడ్త్ సమస్యల కారణంగా ఈ సర్వీసు అందుబాటులో ఉండదు. ఈ సిఫార్సులను అంగీకరించిన తర్వాత, నోటిఫికేషన్ తేదీ నుంచి ఆరు నెలలలోపు సీఎన్ఏపీ ఫీచర్ అందుబాటులోకి రావొచ్చు.
