
బెల్లంపల్లి, వెలుగు: ప్రమాదవశాత్తు మోటార్సైకిల్తో సహా బావిలో పడ్డడు. అందుట్లనే 36 గంటలు బయటకు రాలేక విషసర్పాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపిండు. అయినా, కిస్మత్గట్టిగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డడు. కానీ.. చావు ఎప్పుడు ఏ రూపంలో మింగేస్తదో అంతుపట్టదు. అప్పుడు బావిలో పడి, పాముల మధ్య ఉన్నా మృత్యుంజయుడిగా వచ్చిన అతడు.. శుక్రవారం సెల్ఫోన్మాట్లాడుతూ పట్టాలపై నిలుచోగా రైలు ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. మంచిర్యాల జిల్లా తాండూర్ రైల్వేస్టేషన్లో ఈ సంఘటన జరిగింది.
జమ్మికుంటకు చెందిన వరికెల రాజమొగిళి(60) పత్తి వ్యాపారం చేసేవాడు. శుక్రవారం వ్యాపార పనుల నిమిత్తం జమ్మికుంట నుంచి కాగజ్నగర్కు ఇంటర్సిటీ రైలులో వస్తున్నాడు. రేచిని రైల్వేస్టేషన్లో క్రాసింగ్ ఉండటంతో రైలు ఆగింది. తోటి ప్రయాణికులతో కలిసి రాజమొగిళి కూడా కిందికి దిగాడు. సెల్ఫోన్ మాట్లాడుతూ పక్కన ఉన్న పట్టాల పైకి వెళ్లాడు. సరిగ్గా అప్పుడే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తెలంగాణ ఎక్స్ ప్రెస్వేగంగా వచ్చి రాజమొగిళిని ఢీకొట్టింది. రెప్పపాటులో అతడు విగత జీవిగా మారిపోయాడు. రాజమొగిళికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు రవికుమార్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమొగిళి గతంలో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడినా మృత్యుంజయుడిగా బయటపడ్డాడని, కానీ ఇప్పుడిలా చనిపోతాడని అనుకోలేదని ఆయన సన్నిహితులు విచారం వ్యక్తంచేశారు.