రెండు రైళ్లు ఢీకొని 8 మంది మృతి.. చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రమాదం

రెండు రైళ్లు ఢీకొని 8 మంది మృతి.. చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ప్రమాదం
  • చత్తీస్‌గఢ్​లోని బిలాస్‌ పూర్​లో ప్రమాదం
  • గూడ్స్​ రైలును ఢీకొట్టిన కోర్బా ప్యాసింజర్​ ట్రైన్.. 
  • నుజ్జునుజ్జయిన ప్యాసింజర్​ రైలు ముందు బోగీలు
  • 14 మందికి తీవ్రగాయాలు.. మృతుల సంఖ్య పెరిగే చాన్స్​


రాయ్‌‌పూర్‌‌‌‌: చత్తీస్‌‌గఢ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొనడంతో 8 మంది మృతిచెందారు. 14 మందిగాయపడ్డారు. బిలాస్‌‌పూర్‌‌‌‌ జిల్లా బిలాస్‌‌పూర్​కాట్నీ సెక్షన్‌‌లోని లాల్​ఖాదన్ ఏరియాలో మంగళవారం  (నవంబర్ 04)  మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. జైరామ్‌‌ నగర్ స్టేషన్‌‌ సమీపంలో గూడ్స్‌‌ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్‌‌‌‌ ట్రైన్ ఇంజిన్‌‌,​ ముందు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. 

బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు, ఎన్డీఆర్‌‌‌‌ఎఫ్‌‌తో కూడిన రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించినట్టు బిలాస్‌‌పూర్​ ఎస్పీ రజనీశ్‌‌ సింగ్​ పేర్కొన్నారు. ఓ శిశువును కాపాడినట్టు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతున్నదని, తీవ్రంగా గాయపడ్డవారికి రైలు బోగీలోనే చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.

నిలిచిపోయిన రైళ్లు..

గూడ్స్​ రైలు ఇంజన్​పైకి ప్యాసింజర్ ​రైలు ముందు బోగీలు ఎక్కినట్టు వీడియోల్లో కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో ఎలక్ట్రిక్ వైర్లు, సిగ్నల్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. బిలాస్‌‌పుర్‌‌–-హావ్‌‌డా లైన్‌‌ మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు సర్వీసులు రద్దయ్యాయి. మరికొన్నింటిని దారిమళ్లించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సాంకేతిక బృందాలు ట్రాక్‌‌లను, విద్యుత్​ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నాయి. కాగా, ప్రమాదానికి కారణాన్ని గుర్తించడానికి రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.