
హైదరాబాద్, వెలుగు: ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు చేయాలని డిమాండ్ చేస్తూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) ఆధ్వర్యంలో గురువారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ను టీచర్లు ముట్టడించారు. ఆఫీస్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తర్వాత ఉపాధ్యాయులతో పాటు ఎస్జీటీయూ లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, వెంకటేశం మాట్లాడారు. అప్ గ్రేడ్ చేసిన లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ పోస్టుల ప్రమోషన్లలో హైకోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో 317 అమలుతో స్థానికత కోల్పోయిన వారిని దశల వారీగా సొంత జిల్లాలకు పంపించాలని కోరారు. పీఆర్సీలో ఎస్జీటీ, ఎస్ఏల బేసిక్ పేలో వ్యత్యాసం తగ్గించాలన్నారు. ధర్నాలో ఎస్జీటీయూ నాయకులు అంజయ్య, శ్రీరామ్ శ్రీనివాస్, వనం వెంకటేశ్వర్లు, గాయత్రి, మంజుల, శైలజ తదితరులు పాల్గొన్నారు.