హైదరాబాద్ సరోగసీ స్కామ్: రిపోర్టులు తారుమారు చేస్తారు.. ఐవీఎఫ్ పేరుతో ట్రీట్మెంట్ గోల్‎మాల్

హైదరాబాద్ సరోగసీ స్కామ్: రిపోర్టులు తారుమారు చేస్తారు.. ఐవీఎఫ్ పేరుతో ట్రీట్మెంట్ గోల్‎మాల్

హైదరాబాద్: సాధారణంగా పెండ్లయిన రెండు, మూడేండ్లలోపు పిల్లలు కాకపోతే ముందు గైనకాలజిస్ట్‎ను సంప్రదిస్తారు. అక్కడ కొన్ని టెస్టులు చేశాక సాధారణ మెడిసిన్స్​ఇచ్చి టైమ్​తీసుకోవాలని డాక్టర్లు చెప్తుంటారు. అయితే, అప్పటికీ పిల్లలు కాకపోతే.. ఐవీఎఫ్​సెంటర్లను దంపతులు ఆశ్రయిస్తుంటారు. కొందరు డాక్టర్లయితే నేరుగా ఐవీఎఫ్‎కే రిఫర్​ చేస్తుంటారు. దీంతో ఐవీఎఫ్​సెంటర్లలో.. అవసరం ఉన్నా, లేకున్నా అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. అదంతా సెంటర్లలోనే చేస్తున్నారు. ఇందుకు పెద్ద మొత్తంలో దంపతుల నుంచి డబ్బులు రాబడ్తున్నారు. 

అయితే ఈ క్రమంలో టెస్టుల రిపోర్టులను కూడా మార్చి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక సంతానలేమి కారణం చూపి.. వారిని ఐవీఎఫ్‎కు ప్రిపేర్​ చేయడం, వేల రూపాయల విలువైన మెడిసిన్​కొనుగోలు చేయించడమే లక్ష్యంగా దందాలు కానిస్తున్నారు. బయటి మెడికల్ షాపుల్లో తక్కువ ధరకు మందులు లభించే అవకాశమున్నా ఆ మందులను తమ ఆస్పత్రి ఫార్మసీలోనే కొనాలని కండిషన్లు పెడ్తున్నారు. 

కొన్ని జంటలకు చిన్న సమస్య ఉన్నప్పుడు ఐయూఐ (ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్) పద్ధతిలో గర్భందాల్చేలా చేస్తారు. ఇది తక్కువ ఖర్చుతోనే అయిపోతుంది. సాధారణంగానే గర్భధారణ ప్రక్రియ ముగుస్తుంది. దీన్ని ఐవీఎఫ్ పద్ధతిని చేయడానికి ముందుగా నిర్వహిస్తారు. ఈ విధానంలో భర్త నుంచి స్పెర్మ్‎ని కలెక్ట్ చేసి దాన్ని డైరెక్ట్‎గా భార్య యుటెరస్‎లోకి ఎగ్స్​రిలీజ్​అయిన సమయానికి పంపిస్తారు. అప్పుడు ఫర్టిలైజేషన్ జరిగే అవకాశం ఉంది. దీనిలో స్పెర్మ్‎ని పంపించగానే అది ఫాలోపియన్ ట్యూబ్స్ వద్దకి వెళ్తుంది. అయితే చాలా ఐవీఎఫ్​సెంటర్లు ఐయూఐను ఏదో నామమాత్రంగా చేస్తున్నాయి. దీంతో దంపతులను ఐవీఎఫ్​ పద్ధతికే వెళ్లేలా పురిగొల్పుతున్నాయి.  

ఐవీఎఫ్ పద్ధతిలో భార్య ఎగ్స్‎ని తీసి.. ఫర్టిలైజేషన్ చేస్తారు. సర్జికల్ ప్రొసీజర్ ద్వారా నీడిల్‌‌‌‌తో ఎగ్స్‏ని తీసి, ఆ తర్వాత భర్త స్పెర్మ్‎ని కలెక్ట్ చేసి ఈ రెండింటినీ కూడా ఫర్టిలైజ్ చేస్తారు. అనంతరం ఎంబ్రియోని మహిళ కడుపులోకి పంపిస్తారు. ఈ ట్రీట్మెంట్‎లో చాలా స్టెప్స్ ఉన్నాయి. వీటిని పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ క్రమంలో కొన్ని జంటలకు సంబంధించి ఎగ్స్​వారివి కాకుండా ఇతరుల నుంచి తీసుకోవడం, కొందరు డాక్టర్లు భర్త స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా తల్లిదండ్రులవుతారని తప్పుదారి పట్టిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భర్తది కాకుండా మరొకరి స్పెర్మ్ ప్రవేశపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.   

మన దేశంలో సరోగసీ (అద్దె గర్భం) విధానంపై పరిమితులు ఉన్నాయి. సరోగసీ(నియంత్రణ) చట్టం – 2021 పేరుతో కేంద్రం ప్రభుత్వం 2022 జనవరి నుంచి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం.. కమర్షియల్ పద్ధతిలో, అంటే డబ్బుల కోసం సరోగసీ విధానంలో పిల్లలను కనడం చట్టవిరుద్ధం. కేవలం నిస్వార్థ పద్ధతిలో పిల్లలను కనేందుకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంది. కానీ, చాలా ఫెర్టిలిటీ సెంటర్లు కమర్షియల్​పద్ధతిలో సరోగసీని నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా, సరోగసీపేరు చెప్పి నమ్మించి.. వేరే వాళ్ల పిల్లలను కొని జంటలకు అప్పగిస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సికింద్రాబాద్‎లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్​ ఉదంతం. 

ఏఆర్టీ చట్టం, బోర్డు ఉన్నా..!

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) చట్టం- –2021 (ఏఆర్టీ చట్టం) ప్రకారం ప్రతి రాష్ట్రంలో ‘స్టేట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అండ్ సరోగసీబోర్డు’ ఉండాలి. ఈ బోర్డు రాష్ట్రంలోని ఫెర్టిలిటీ కేంద్రాలను పర్యవేక్షించడం, రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడం వంటివి చేయాలి. అయితే, రాష్ట్రంలో ఈ బోర్డు నామమాత్రంగానే ఉందనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వ వెబ్​సైట్ లో రాష్ట్రంలో 2022లో ఏర్పాటు చేసిన బోర్డుకు సంబంధించిన పాత వివరాలే ఉన్నాయి.  

బోర్డు  కేవలం కాగితాలపైనే ఉందని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతోనే ఐవీఎఫ్​ కేంద్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా వాటిపై సరైన విచారణ జరగడం లేదని తెలుస్తున్నది. ఏఆర్టీ చట్టం – 2021 ప్రకారం ప్రతి ఫెర్టిలిటీ సెంటర్, ఏఆర్టీ బ్యాంక్ తప్పనిసరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. నిర్దిష్టమైన మౌలిక వసతులు, అర్హత కలిగిన వైద్య నిపుణులు ఉండాలి. అయితే చాలా చోట్ల ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.

 ఏఆర్టీ చట్టం దాతల (స్పెర్మ్/అండం) వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టింది. దాతలు నిర్దిష్ట వయస్సులో ఉండాలి,. ఆరోగ్యంగా ఉండాలి.. ఒక దాత నుంచి పరిమిత సంఖ్యలో మాత్రమే అండాలను సేకరించాలి. కానీ, కొన్ని కేంద్రాలు దాతలకు సరైన పరీక్షలు చేయకుండానే స్పెర్మ్​, అండాలు ఉపయోగించడం.. లేదా ఒకే దాత నుంచి అధిక సంఖ్యలో వాటిని సేకరించి, అనేక మందికి వినియోగించి సొమ్ము చేసుకుంటున్నాయి.