ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్రలు

ఆదివాసీలను వెళ్లగొట్టే కుట్రలు
  • స్పష్టం చేసిన ఆదివాసీ, బీఆర్ఎస్ నేతలు  
  • టైగర్ కన్జర్వేషన్ జోన్ 
  • జీవో రద్దు చేయాలి 
  • ఆసిఫాబాద్ ​జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

ఆసిఫాబాద్, వెలుగు:  కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీ గిరిజనులు కదం తొక్కారు. గత నెల 30న జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ గా ప్రకటించి, జారీ చేసిన జీఓ 49ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వందలాది మంది ఆదివాసీ గిరిజనులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు.  సంప్రదాయ వాయిద్యాలతో  అంబేద్కర్ చౌక్​ చేరుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించి వినతిపత్రం అందజేశారు. 

అక్కడి నుంచి గాంధీ, వివేకానంద చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్ జోన్ కు వ్యతిరేకంగా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 5 గంటల పాటు ఆందోళన కొనసాగింది.  దీనికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ.. ఆదివాసీలను కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్న  ఫారెస్ట్ ఆఫీసర్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జీవో .49 తో ఆదివాసీలను అడవుల నుంచి తరిమేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టైగర్ జోన్ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆదివాసీ గిరిజనులకు మేలు చేస్తామని పెట్టారని, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. రాంజీగోండ్ కుమ్రంభీం స్ఫూర్తితో ఆదివాసీలు మరోపోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.   ఈ ధర్నాలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కోట్నాక్ విజయ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు బుర్స పొచయ్య ,జిల్లా అధ్యక్షుడు కోవ విజయ. కుమార్, మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతీ ,ఆదివాసీ నాయకులు  సిడం ,ఆర్జు మడవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.