బీజాపూర్‌‌ జిల్లాలో ఐఈడీ పేలి యువకుడు మృతి

 బీజాపూర్‌‌ జిల్లాలో ఐఈడీ పేలి యువకుడు మృతి
  • చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాలో ఘటన

భద్రాచలం, వెలుగు : మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఓ గిరిజన యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌ జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. ఎస్పీ జితేంద్రయాదవ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఐతా కుహరామీ (20) అనే యువకుడు ఆదివారం సాయంత్రం ఊసూరు పీఎస్‌‌ పరిధిలోని కస్తూరిపాడ్‌‌ అడవుల్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలిపోయి అతడి రెండు కాళ్లు తెగి పడిపోయాయి. 

గమనించిన స్థానికులు అతడిని హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు కస్తూరిపాడ్‌‌ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అటవీ ప్రాంతానికి బాంబ్‌‌ స్క్వాడ్‌‌ను తీసుకెళ్లి ఇంకా ఏమైనా ఐఈడీలు ఉన్నాయా ? అని తనిఖీలు చేపట్టారు.