
సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను లీడ్ రోల్స్లో మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించారు. ఈనెల 29న సినిమా విడుదల సందర్భంగా నటుడు వశిష్ట సింహా మాట్లాడుతూ ‘టైటిల్ వినగానే స్టోరీపై ఆసక్తి కలిగింది. దర్శకుడు నెరేషన్ చేసిన దానికంటే విజువల్ అద్భుతంగా వచ్చింది. ఈ కథ మన చుట్టుపక్కల జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ఓ మిడిల్ క్లాస్ యువకుడిగా ఈ సమాజాన్ని ప్రతిబింబించేలా నా పాత్ర ఉంటుంది.
ఇందులోని ప్రతీ పాత్రకు బార్బరికుడి థీమ్కు లింక్ ఉంది. త్రిబాణంలో ఎవరు ఏ బాణం అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఇది పౌరాణిక చిత్రం కాదు.. బార్బరికుడు, అతని శక్తిని ఈ తరానికి చెప్పే సోషియో థ్రిల్లర్. సమాధానం దొరకని ఘటనలు సమాజంలో నిత్యం చూస్తున్నాం. వాటన్నింటికీ సమాధానాలు చెబుతూ సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచదని చెప్పగలను. దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి నుంచి ఇలాంటి కంటెంట్ బేస్డ్ చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా” అని చెప్పాడు.