ఖాళీగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇండ్లను ఆక్రమించుకున్న గిరిజనులు

ఖాళీగా ఉన్న డబుల్​ బెడ్రూం ఇండ్లను  ఆక్రమించుకున్న గిరిజనులు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని త్రీ ఇంక్లైన్ లో నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఖాళీగా ఉంటుండడంతో  గిరిజనులు గురువారం ఆక్రమించుకున్నారు. పది డబుల్ ​బెడ్​రూం ఇండ్లు ఐదారేండ్లుగా నిరూపయోగంగా ఉన్నాయని, ఎవరికీ ఇవ్వడం లేదని సామాన్లతో పాటు లోపలకు వెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు గిరిజనులను అడ్డుకున్నారు. స్థానికులమైన తమకు ఇవ్వకుండా సర్పంచ్ తండావాసులను ఉసిగొల్పి ఆక్రమించుకునేలా చేశారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ ​ఆఫీస్​కు ఫోన్​ చేసి చెప్పడంతో రెవెన్యూ ఇన్​స్పెక్టర్​అక్కడకు చేరుకొని గిరిజనులతో చర్చలు జరిపారు. ఇన్నేండ్ల నుంచి ఇండ్లను ఖాళీగా పెట్టారని, తమలాంటి పేదలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆర్ఐ ఇండ్లు ఖాళీ చేయకపోతే కేసులు పెడతామని హెచ్చరించడంతో సామాన్లు తీసుకుని వెళ్లిపోయారు.