ట్రిపుల్ ఆర్ రెండు ‘కాలా’ల్లో .. 7,292 చెట్లు పోతున్నయ్

ట్రిపుల్ ఆర్ రెండు ‘కాలా’ల్లో .. 7,292 చెట్లు పోతున్నయ్
  • బోర్లు, బావులు, చెరువులు 388 నిర్మాణాలు 354
  • స్ట్రక్చర్ వెరిఫికేషన్​ సగమే
  • తుర్కపల్లి పరిధిలో కంప్లీట్​

యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పనుల కారణంగా ప్రకృతి దెబ్బతింటుంది. ట్రిపుల్ ఆర్ రెండు 'కాలా' పరిధిల్లో 7,292 చెట్లు తొలగించనున్నారు. రానున్న రోజుల్లో రీజినల్​ రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో వేలాది చెట్లు, వందల సంఖ్యలో నిర్మాణాలు, పదుల సంఖ్యలో చెరువులు మాయమైపోతున్నాయి. దీనికి సంబంధించి యాదాద్రి జిల్లాలో సగమే జరిగిన స్ట్రక్చర్ ఎంక్వైరీ, వెరిఫికేషన్​లో ఏ స్థాయిలో చెట్లు, చెరువులు, నిర్మాణాలు తొలగించాల్సి వస్తుందో ఆఫీసర్లు లెక్కించారు. భూములు ఇవ్వడానికి రైతులు వ్యతిరేకించడం వల్ల స్ట్రక్చర్ ఎంక్వైరీ, వెరిఫికేషన్​మధ్యలోనే ఆగిపోయింది.

స్ట్రక్చర్ వెరిఫికేషన్​ సగమే..

సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో ట్రిపుల్​ఆర్ ఉత్తర భాగం నిర్మాణం కానుంది. 164 కిలో మీటర్ల రోడ్డుకు అవసరమైన భూమిని సేకరించడానికి ఆయా జిల్లాల్లో 8 'కాలా'(కాంపిటెంట్​ అథారిటీ ఫర్​ లాండ్​ అక్విజేషన్​)ను ఏర్పాటు చేసి అడిషనల్​ కలెక్టర్, ఆర్డీవోలను బాధ్యులుగా నియమించారు. యాదాద్రి జిల్లాలో 59.33 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు 'కాలా'లకు సంబంధించి 1,795 ఎకరాలకు త్రీజీ నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. 

పరిహారంలో కీలకమైన స్ట్రక్చర్ ఎంక్వైరీ, వెరిఫికేషన్ జిల్లాలో అసంపూర్తిగా జరిగింది. తుర్కపల్లి 'కాలా' పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సేకరించే భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్ట్రక్చర్ ఎంక్వైరీ ముగిసింది. చౌటుప్పల్​ కాలా పరిధిలో వలిగొండ, చౌటుప్పల్​మండలాల్లో కొంతమేర స్ట్రక్చర్ ఎంక్వైరీ జరగగనే బాధితులు అడ్డుకోవడంతో నిలిచిపోయింది. భువనగిరి 'కాలా' పరిధిలోని రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.   

తుర్కపల్లి పరిధిలో 5,857 చెట్లు..

తుర్కపల్లి కాలా పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి పరిధిలో 19 కిలోమీటర్ల మేర ట్రిపుల్ ఆర్ నిర్మాణం జరగనుంది. ఈ రెండు మండలాల పరిధిలో స్ట్రక్చర్ ఎంక్వైరీ జరగడంతోపాటు వెరిఫికేషన్ కూడా ముగిసింది. ఈ లెక్కల ప్రకారం తుర్కపల్లి కాలా పరిధిలో అటవీ, ఎక్సైజ్, హార్టికల్చర్ శాఖల పరిధిలోకి వచ్చే 5,857 చెట్లను తొలగించాల్సి ఉంటుంది. ఆర్​డబ్ల్యూఎస్​ పరిధిలోని చెరువులు, బావులు, బోర్లు, పైపులైన్లు కలుపుకొని 201 తొలగించనున్నారు. ఆర్​అండ్​బీ పరిధిలోకి వచ్చే ఆలయాలు, ఇండ్లు, షెడ్స్, ఫౌల్ట్రీ ఫామ్స్, కంపౌండ్ వాల్స్, ఫెన్సింగ్​లు, సమాధులు కలుపుకొని 306 తొలగిస్తారు. చెట్లు, చెరువులు సహా అన్ని కలుపుకొని మొత్తంగా 6,364 తొలగించాల్సి ఉంటుంది. 

చౌటుప్పల్​ పరిధిలో 1435..

చౌటుప్పల్​కాలా పరిధిలోని వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో స్ట్రక్చర్​ ఎంక్వైరీ జరుగుతుండగానే అడ్డంకులు ఎదురయ్యాయి. భూములు ఇవ్వడానికి ఇష్టపడని రైతులు అడ్డుకోవడంతో ఎంక్వైరీని నిలిపివేశారు. ఎంక్వైరీ జరిగినంత వరకు అటవీ, ఎక్సైజ్, హార్టికల్చర్​శాఖల పరిధిలోకి వచ్చే 1,435 చెట్లు ఉన్నాయి. ఆర్​డబ్ల్యూఎస్​ పరిధిలోకి వచ్చే బావులు, బోర్లు, చెరువులు, పైపులైన్లు కలుపుకొని 187, ఆర్​అండ్​బీ పరిధిలో 48 నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. 

282 మంది రైతులకు నోటీసులు..

చౌటుప్పల్, తుర్కపల్లి 'కాలా' పరిధిలో సేకరించే 136.17 ఎకరాల్లో ఎలాంటి స్ట్రక్చర్స్ లేవని తేలింది. దీంతో ముందస్తుగా పరిహారం వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో రూ. 21.55  కోట్ల అవార్డు పాస్ చేశారు. ఇందులో ప్రభుత్వ ఆధీనంలోని భూములు పోను చౌటుప్పల్​ పరిధిలోని 250, తుర్కపల్లి పరిధిలోని 32 మంది రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిలో కొందరు రైతులు పరిహారం తక్కువగా వస్తుందని నోటీసులను తిరస్కరించారు. పరిహారం పెంచాలని ఆర్బిట్రేషన్ (కలెక్టర్​నేతృత్వంలోని కోర్టు)​ను ఆశ్రయించారు.  

డాక్యుమెంట్స్ అందించిన రైతుల వివరాలతోపాటు డాక్యుమెంట్స్ అందించని వారికి సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వివరాలను జిల్లాఫీసర్లు 'భూమి రాశి' పోర్టల్​లో అప్​లోడ్​ చేయనున్నారు. ఆ తర్వాతే రైతుల అకౌంట్లలో పరిహారం జమ అవుతుంది. అయితే డాక్యుమెంట్స్​ అందించని రైతులకు నేషనల్​ హైవే ఆఫీసర్లు 3 ఈ నోటీసులను జారీ చేసి భూమిని పొజీషన్​లోకి తీసుకుంటారు. భువనగిరిలో స్ట్రక్చర్స్ ఎంక్వైరీ జరగలేదు. తుర్కపల్లి పరిధిలో పూర్తిగా, చౌటుప్పల్​లో పాక్షికంగా జరిగింది. 

స్ట్రక్చర్స్​ వివరాలు..

కాలా    చెట్లు    నీటి వనరులు    నిర్మాణాలు
తుర్కపల్లి    5,857    201    306
చౌటుప్పల్​    1,435    187    48
మొత్తం    7,292    388    354