
న్యూఢిల్లీ: నచ్చిన చానెళ్లే, చూసే చానెళ్లే తీసుకునేలా వినియోగదారుడి కోసం కొత్త ప్లాన్ అమలు చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్). కానీ, అది బెడిసికొట్టింది. ఖర్చు తగ్గుతుందనుకుంటే, ఇంకా ఎక్కువైతోందని చాలా మంది వినియోగదారులు ట్రాయ్కు ఫిర్యాదు చేశారు. నిజమే మరి. ఇప్పుడు ఎక్కువ చానెళ్లు పెట్టుకోవాలనుకుంటే చేతి చమురు వదలాల్సిందే. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే కేబుల్, డీటీహెచ్ రేట్లను తగ్గించేలా ట్రాయ్ కసరత్తులు చేస్తోంది. కేబుల్ బిల్లులు తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ డీటీహెచ్ సంస్థలకు సూచనలతో కూడిన నోట్ (కన్సల్టేషన్ పేపర్)ను పంపనుంది. ఒకవేళ ఆ కన్సల్టేషన్ పేపర్ ఆమోదం పొందితే, కేబుల్ బిల్లులు తగ్గి వినియోగదారుడికి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇక, ఈ విషయాన్ని ట్రాయ్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. టీవీ చానెళ్ల ధరలు తగ్గించాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు ఫలితాన్నివ్వలేదని, అందుకే చానెళ్ల ధరలు తగ్గించేలా డీటీహెచ్, కేబుల్ సంస్థల నుంచి ట్రాయ్ కన్సల్టింగ్ పేపర్లను కొద్ది రోజుల్లో పిలుస్తుందని ఆయన చెప్పారు. అది ఆమోదం పొందితే చట్టబద్ధంగా చానెళ్ల టారిఫ్లు, నిబంధనలను ట్రాయ్ పొందుపరిచే అవకాశం ఉంటుందని వివరించారు