- భగీరథపై కేటీఆర్ వి అబద్ధాలు
- రూ. 30 వేల కోట్ల ఖర్చు చేసి 10% ఇండ్లకూ నీళ్లవ్వలేదు
- కమీషన్ల కోసమే ఈ పథకం తెచ్చారు
- రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చారు: ఉత్తమ్
దేవరకొండ పర్యటనలో మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికీ ఇస్తున్నామంటూ అబద్ధపు ప్రచారం చేశారని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. మిషన్ భగీరథ పథకానికి రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో 10 శాతం ఇండ్లకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. కమీషన్ల కోసమే ఈ పథకాన్ని తెచ్చారని, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ఆఫీసులో పార్టీ కౌన్సిలర్లను ఉత్తమ్ అభినందించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ భగీరథ నీళ్ల సంగతి అటుంచితే కాంగ్రెస్ హయాంలో కట్టిన పాత ట్యాంకులకు కొత్త రంగులేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందని సర్కారును విమర్శించారు.
ప్రజలను మభ్యపెడుతున్న కేసీఆర్
‘‘మూడేండ్లకే మిషన్ భగీరథ పథకం పూర్తి చేస్తామని, లేకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన సీఎం కేసీఆర్ ఆరేండ్లయినా ఆ పథకం పనులు అసంపూర్తిగానే మిగిల్చారు. దాని నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అంటున్నారు” అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల టైంలోనే రైతు బంధు పథకం డబ్బులను వేస్తూ దాన్ని ఎలక్షన్ బంధు పథకంగా మార్చారని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగ భృతి అడ్రస్ లేకుండాపోయాయని వ్యాఖ్యానించారు. మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లపై గళం విప్పుతామని చెప్పారు.