- ఆరేండ్లుగా మున్సిపాల్టీలకు కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదు
- మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రలు
- పనులు చేయలేదని, డబ్బు ప్రవాహాన్ని నమ్ముకున్నరు
- నిరుద్యోగ భృతి ఇచ్చిన్రా? రుణమాఫీ చేసిన్రా?
- ఫేస్బుక్ లైవ్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి
హైదరాబాద్, వెలుగు:
‘‘రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో షాక్ ఇవ్వాలి. ఎలక్షన్లలో గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ కుట్రలను ఎదుర్కొని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి. డబ్బు ప్రవాహంతో గెలిచే ప్రయత్నం చేస్తున్న టీఆర్ఎస్ను అడ్డుకునేందుకు పోరాటాలు చేయాలి”అని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఫేస్బుక్ లైవ్లో ఆయన మాట్లాడారు. 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిపించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు చురుగ్గా పని చేయాలని కోరారు.
మున్సిపోల్స్లో గెలిచేందుకు కుట్రలు
మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్రలకు పాల్పడుతోందని, ఓటర్ లిస్ట్, రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూల్ విడుదల చేశారని ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యంతరాలను ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక, క్యాస్ట్ సర్టిఫికెట్లు అందించడానికి టైమ్ పడుతుందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. హైకోర్టు కేసు కొట్టేసిన వెంటనే ఆఫీసులు తెరవకముందే నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారని విమర్శించారు. నామినేషన్ల స్క్రూటినీలో అక్రమాలు జరగకుండా పార్టీ అభ్యర్థులను కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నామినేషన్ల స్ర్కూటినీ, విత్డ్రా సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆరేండ్లలో ఏం చేయలె?
రాష్ట్రంలోని 40 శాతం జనాభా ఉండే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఆరేండ్లుగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిందేమీ లేదని ఉత్తమ్ విమర్శించారు. ఏ మున్సిపాల్టీకి పోయినా.. రోడ్లను మిషన్ భగీరథ పేరుతో తవ్వి ధ్వంసం చేశారని, ఎటువంటి సౌలత్లు లేవని, సానిటేషన్ దారుణంగా ఉందని మండిపడ్డారు. పని చేయలేదనే విషయం బయటపడకుండా ఎన్నికలను డబ్బు మయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏం చేశారని టీఆర్ఎస్ నాయకులు ఓటు అడుగబోతున్నారని ప్రశించారు. నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని చెప్పిన టీఆర్ఎస్ ఏ ఒక్కరికైనా ఇచ్చిందా? అని నిలదీశారు.
టీఆర్ఎస్, బీజేపీ మిలాఖత్
పెద్ద నోట్ల రద్దు, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని, సీఏఏకి వ్యతిరేకంగా పంజాబ్, బెంగాల్, కేరళ, బీహార్ స్పష్టమైన ప్రకటనలిచ్చినా, సీఎం కేసీఆర్ తీర్మానం చేయలేదని, అయినా మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీల్లో అవినీతిరహిత పాలన, మంచి సివిక్ ఫెసిలిటీస్ కల్పిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, కలసికట్టుగా ముందుకెళ్లి ఎక్కువ చోట్ల గెలవాలని పార్టీ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు.