రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగ

రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగ
  • రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యేను కొనబోయి దొరికిన దొంగవి.. సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని బ్లాక్ మెయిలర్ గా ఎదిగిన నేతవు నువ్వేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. సహచర ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మేం రాజ్యాంగం ప్రకారమే మేము కాంగ్రెస్ లేజిస్లేటివ్ పార్టీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశామన్నారు. మమ్మల్ని రాళ్లతో కొట్ట మంటావా..నీ క్యారక్టర్ ఏంది.. మా క్యారక్టర్ ఏంది అని ఆయన ప్రశ్నించారు. నువ్వు కాంగ్రెస్ లో చేరినప్పుడు ఎమ్మెల్యే గా రాజీనామా ఎందుకు చేయలేదు..?  ఎమ్మెల్యే గా రాజీనామా లేఖను అసెంబ్లీ కి ఎందుకు పంపలేదు అని నిలదీశారు. నువ్వు రాళ్లతో కొడితే మేము చెప్పులతో కొడుతం.. అంటూ హెచ్చరించారు. 
కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ కు 25 కోట్లు ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్న నిన్ను చూసి సీనియర్ నేతలు రోదిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ లో కాంగ్రెస్ అధికారం లోకి రావడం కల్ల.. రేవంత్ రెడ్డి చివరికి జోకర్ గా మిగులుతాడని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి డబ్బులతో మేనేజ్ చేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు తెచ్చుకొని ఎంజాయ్ చేస్తున్నాడని.. ఎన్నో త్యాగాలు చేసి ఏ పదవి రాక చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వియోగం చేసింది రేవంత్ రెడ్డేనని, రిటైర్డ్ సర్వేయర్ లు, ఆర్.ఐలతో టీంలు తయారు చేసుకొని ..భూములపై సమాచార హక్కు ద్వారా వివరాలు తెప్పించుకుని.. అందులో లొసుగులు తెలుసుకొని బ్లాక్ మెయిల్ చేయటం రేవంత్ రెడ్డికి అలవాటు అని సుధీర్ రెడ్డి ఆరోపించారు. 
పీసీసీ ఇవ్వకపోతే రేవంత్ కాంగ్రెస్ లో ఉండేవాడా: గండ్ర వెంకట రమణారెడ్డి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మేము రాజ్యంగం ప్రకారమే టీఆర్ఎస్ లో చేరాము.. ఇది తప్పు అయితే  ఏ  న్యాయ స్థానంలోనైనా  ఏ శిక్ష కైనా సిద్దమన్నారు. పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో వుండేవాడా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి రాళ్లతో కొట్టి చంపాలని మావోయిస్టుల భాష మాట్లాడుతున్నడు.. మావో పార్టీని నిషేదించినట్లు రేవంత్ రెడ్డిని కూడా నిషేధించాలా..? లేక కాంగ్రెస్ పార్టీని నిషేధించాలా ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లెటర్ ఎవరికి ఇచ్చావని నిలదీశారు. నీ రాజీనామా లేఖను చంద్రబాబు కు ఎట్లా ఇస్తవ్ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు నేను లైన్ క్రాస్ చేయలేదు.. లైన్ క్రాస్ చేసే పరిస్థితి తేవొద్దు అని ఆయన హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన ఆయనపై పీనల్ కోడ్ 503, 506 సెక్షన్ ప్రకారం కేసు పెట్టి శిక్ష పెట్టవచ్చు అని ఆయన పేర్కొన్నారు.