కంకి, సుత్తి కొడవలి గుర్తులను కేసీఆర్ కొనుక్కున్నాడు: రఘునందన్ రావు

కంకి, సుత్తి కొడవలి గుర్తులను కేసీఆర్ కొనుక్కున్నాడు: రఘునందన్ రావు

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలని టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా సంస్థాన్ నారాయణపురంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త వీఎన్ ​గౌడ్ బీజేపీలో చేరారు. అనంతరం మాట్లాడిన రఘునందన్ రావు దుబ్బాకలో బీజేపీ గెలుపు కారణంగా సీఎం కేసీఆర్ వద్ద తమ విలువ పెరిగిందని టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు అనుకున్నారని చెప్పారు. హుజూరాబాద్​లో ఈటల గెలుపుతో ప్రగతి భవన్ గేట్లను ఓపెన్​ చేశారని, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తమను పేరు పెట్టి పిలుస్తారన్న భావనకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు వచ్చారని అన్నారు.

మునుగోడులో ఎలాగైనా గెలిచేందుకే  కంకి, సుత్తి కొడవలి గుర్తులను కేసీఆర్ కొనుక్కున్నాడని తెలిపారు. మునుగోడు ఓటర్లను కొనుగోలు చేయడానికి మంత్రులు, ఎమ్మెల్యేలకు డబ్బులు ఉన్న సూట్​కేసులు ఇచ్చి పంపించారని ఆరోపించారు. అందరినీ వంచిస్తున్న కేసీఆర్​ వైపు ఉంటారో, ఆయనను ఓడించే బీజేపీ వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. గులాబీ జెండా ఏడాది కంటే ఎక్కువ రోజులు రాష్ట్రంలో ఎగరదని అన్నారు. పోలీస్ అధికారులు ఇష్టం వచ్చినట్లు బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రమేశ్​ రాథోడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, దోనూరి వీరారెడ్డి, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.