
హుజురాబాద్ "అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?" అని నేను అంటే ఈటల రాజేందర్ ప్రస్టేషన్ కు గురవుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఇవాళ హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలను బలి చేయకుండా మనమే చర్చ చేద్దాం అని అన్నారు. 2018 ఎలక్షన్ లో నీకు నాకు పోటీ జరిగినప్పుడు కేసీఆర్ నీ వెనకాల ఉంటేనే గెలిచావు. ఇప్పుడు కేసీఆర్ నా వెనకాల ఉన్నారు. రాబోయే ఎలక్షన్ లో నువ్వా నేనా చూసుకుందాం అని సవాల్ చేశారు.
ప్రోటోకాల్ ప్రకారం నా కన్నా చిన్న వాడివి అయినా చర్చకు రమ్మంటున్న నిన్ను.. చర్చకు ఎందుకు మొకం చాటిస్తున్నవ్ ఈటల అంటూ కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఈటలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కేంద్ర ప్రభుత్వ పార్టీలో చేరావు. నీవు కేంద్రం నుండి 100 కోట్లు తీసుకురా, నేను 150 కోట్లు తీసుకొచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని కలిసి అభివృద్ధి చేద్దాం అన్నారు. ఈ నెల 5న అంబేద్కర్ చౌరస్తాలో హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు కూర్చుంటా.. ఈటల రావాలి. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తప్ప వేరే వాళ్లు రావద్దు అని పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు.