
ఎన్నికలంటే చాలు గుళ్లు, గోపురాలంటూ రాజకీయ నాయకులు చేసే హడావిడి ఎలా ఉంటుందో మనకు తెలియంది కాదు. నాయకులు తమ అనుచరులతో పూజలు , ప్రదిక్షణలు చేస్తుంటారు. ఒక్కోసారి ఆయా పార్టీల నేతలు.. అధిష్టానం పెద్దల అండదండల కోసం పరితపిస్తుంటారు. అయితే కొద్దిరోజుల్లో జరిగే జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మరదలు ముఠా పద్మానరేష్ మూడోసారి గాంధీనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసే ముందు ఎమ్మెల్సీ కవితతో కలిసి ముఠా గోపాల్ కుటుంబం గాంధీనగర్ లక్ష్మీగణపతి టెంపుల్ ను దర్శించున్నారు. ఈ సందర్భంగా ముఠాగోపాల్ కుటుంబ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ కవిత మెప్పుకోసం అందరూ చూస్తుండగానే గణపతి విగ్రహం మెడలో టీఆర్ఎస్ కండువా కప్పారు. గెలవాలనుకుంటే పార్టీ కండువాను దేవుడి కాళ్లదగ్గర పెట్టి పూజిస్తే బాగుండేది. కానీ ఏకంగా పార్టీ కండువాను దేవుడి మెడలో వేయడంతో అక్కడున్న భక్తులు కంగుతిన్నారు.